టీటీడీలో జరుగుతున్న అనేక అవకతవకలపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. టీటీడీ అనేది కోట్లాది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించిన అత్యంత పవిత్ర సంస్థ అని, దానిలో జరుగుతున్న అవినీతి ప్రజలను తీవ్రంగా కలచివేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. టీటీడీలో నకిలీ పట్టు శాలువా స్కామ్పై స్పందిస్తూ.. తమ ప్రభుత్వ హయాంలో టీటీడీ పారదర్శకంగా ఉన్నందుకే.. స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా.. ఎలాంటి కార్యక్రమాలు చేసినా సహించేది లేదన్నారు. హిందువులపై ఇష్టానుసారం మాట్లాడుతున్న నేతలు.. ఇతర మతాలపై కూడా ఇలాగే మాట్లాడగలరా ? అని ప్రశ్నించారు.
లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన, పరకామణి అవినీతి, ఇప్పుడు నకిలీ పట్టు వస్త్రాల స్కామ్.. ఇవి మూడు పెద్ద మాయ చర్యలని పవన్ కల్యాణ్ తెలిపారు. లడ్డూ కల్తీపై ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణ జరుగుతోందని, ఇందులో ఎలాంటి వెనుకడుగు వేయబోమని ఆయన స్పష్టం చేశారు. “పరకామణి, లడ్డూ, ఇప్పుడు పట్టు శాలువాల నకిలీ… ఈ పాపాలు చేసినవారిని చట్టమే కాదు, దేవుడూ క్షమించడు” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతిని తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయటకు తీస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. “మా హయాంలో టీటీడీ పారదర్శకంగా పనిచేస్తోంది. అందుకే ఈ స్కామ్లు వెలుగులోకి వస్తున్నాయి” అని అన్నారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలను అసలు సహించబోమని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. హిందూ భావాలపై ఇష్టానుసారంగా మాట్లాడే కొంతమంది నేతలపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇతర మతాలపై ఇలాగే మాట్లాడగలరా?” అని ప్రశ్నించారు. టీటీడీ పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, అవినీతి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
విజిలెన్స్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం స్టాక్లో ఉన్న పట్టు వస్త్రాల శాంపిల్స్ తీసుకొని ధర్మవరం, బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డులో టెస్టింగ్ చేయించారు. శాలువాల్లో సిల్క్కు బదులు పాలిస్టర్ ఉపయోగించినట్టు తేలింది. రెండు టెస్టింగ్ సెంటర్లలోనూ పాలిస్టర్ ఉన్నట్టే రిపోర్ట్ వచ్చింది. అంతేకాదు సిల్క్ హాలోగ్రామ్ కూడా లేనట్టు గుర్తించారు. ఒక్కో శాలువాను 1389కి కొనుగోలు చేశారు. ఈ శాలువాలను నగరిలోని VRS ఎక్స్పోర్ట్ టీటీడీకి అందించింది. తిరుమల ఫ్యాబ్రిక్స్, నాన్న కాటేజేస్, VM రాజా పవర్ లూమ్ యూనిట్ పేరుతో కంపెనీలను రన్ చేస్తోంది ఈ కంపెనీ. 2015 -2025 మధ్య మొత్తం 54 కోట్ల 95 లక్షల90 వేల 782 రూపాయలు విలువైన శాలువాల సరఫరా చేసింది ఈ కంపెనీ. ఈ శాలువాలను నాణ్యత చెక్ చేయకుండానే బిల్లులు చెల్లించేసింది టీటీడీ. దీంతో ఈ కంపెనీ పదేళ్లుగా టీటీడీకి కుచ్చుటోపి పెట్టినట్టు అర్థమవుతోంది. అంతేకాదు టెండర్ నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించింది విజిలెన్స్.
టీటీడీలో ఆశీర్వచనాల అనంతరం బహుకరించే వస్త్రాల విషయంలో చాలా అవినీతి జరిగిందన్నారు టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ. పర్చేస్ కమిటీ సభ్యుడిగా తానే.. ఆ తేడాను గమనించానన్నారు. దాన్ని తానే బయటకు తీశానన్నారు. కొండపైన రూ.1,334కు కొన్న శాలువాను.. కింద షాప్లలో అడిగితే రూ.600కే అదే క్వాలిటీది ఇస్తున్నారని చెప్పారు. అందుకే వెంటనే పర్చేస్ ఆపేసి.. బోర్డు సమావేశంలో చర్చించి.. ధరపై నిర్ణయం తీసుకుంటామంటున్న జ్యోతు నెహ్రూతో మా ప్రతినిధి మణికుమార్ ఫేస్ టు ఫేస్.
ఈ నెల 14న టీటీడీ పర్చేస్ కమిటీ భేటీ కానుంది. పట్టు శాలువాలపై ఆ రోజే కీలక నిర్ణయం తీసుకోనుంది బోర్డు. ప్రస్తుతం 15 రోజులకు మాత్రమే సరిపడేలా పట్టు శాలువాలు ఉన్నట్టు విజిలెన్స్ రిపోర్ట్ చెబుతోంది. అయితే ఈలోపే కొత్త కాంట్రాక్టర్కు బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. స్వామి నిధులు వృథా కాకూడదంటున్నారు బోర్డు సభ్యులు.. అందుకే ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 16 టీటీడీ పాలకమండలి సమావేశంలో విజిలెన్స్ నివేదిక చర్చ జరగనుంది. అయితే పదేళ్లుగా ఇలాంటి పాలిస్టర్ శాలువాలే సప్లై చేస్తున్నారా? శ్రీవారి భక్తులు పదేళ్లుగా మోసపోతూనే ఉన్నారా? అసలు అధిక ధరలకు శాలువాలను ఎందుకు కొనాల్సి వచ్చింది? అధికారులు, గత పాలకమండలి సభ్యుల పాత్ర ఇందులో ఉందా? అనే అంశంపై విచారణ జరిగే అవకాశం ఉంది.