AC Electricity Bill: సమ్మర్ వచ్చేందంటే చాలు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఏసీలను వినియోగిస్తుంటారు. అయితే ఈ క్రమంలోనే భరించలేని విద్యుత్ బిల్లు బారిన పడి జేబులకు చిల్లులు పెట్టుకుంటారు. అయితే ఏసీల వినియోగం విషయంలో కొన్ని టిప్స్ పాటించడం ద్వారా పవర్ బిల్లును నియంత్రించవచ్చు. అలాంటి టాప్ – 5 టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
అధిక వేడి నుంచి తప్పించుకునేందుకు కొందరు ఏసీ ఉష్ణోగ్రతను అమాంతం తగ్గించేస్తారు. గది త్వరగా చల్లబడాలన్న ఉద్దేశంతో 16°C లేదా 18°C వద్ద టెంపరేచర్ పెడతారు. దీని వల్ల పవర్ బిల్లు భారీగా వచ్చే ప్రమాదముంది. నిత్యం ఈ టెంపరేచర్ లో ఉండటం వల్ల చర్మం, శ్వాసకోస సమస్యలు సైతం తలెత్తవచ్చు. కాబట్టి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) సూచించిన విధంగా 24°Cని మెయిన్ టెన్ చేయండి. ఇది కరెంటును ఆదా చేస్తోంది. ఏసీలో ప్రతి ఒక్క డిగ్రీ పెంచడం వల్ల దాదాపు 6% కరెంటు ఆదా అవుతుంది.
సమ్మర్ లో ఏసీ విత్ సీలింగ్ ఫ్యాన్ మంచి కాంబినేషన్ గా చెప్పవచ్చు. గదిని చల్లబరడానికి పూర్తిగా ఏసీపైనే ఆధారపడకుండా.. సీలింగ్ ఫ్యాన్ ను తక్కువ స్పీడ్ తో పెట్టండి. ఇది ఏసీ నుంచి విడుదలయ్యే చల్లటి గాలిని అన్ని మూలలకు విస్తరింపజేసి.. గదిని వేగంగా చల్లబరిచేందుకు దోహదం చేస్తుంది. తద్వారా ఏసీ మీద ఒత్తిడి తగ్గించి.. విద్యుత్ బిల్లును ఆదా చేస్తుంది.
గదిలోకి వచ్చిన వెంటనే కొందరు ఏసీని వెంటనే ఆన్ చేస్తుంటారు. ఇది సరైన పద్దతి కాదు. గదిలోని తలుపులు, కిటికీలు మూసివేసిన తర్వాతనే ఏసీని ఆన్ చేయాలి. ఇలా చేయడం ద్వారా గదిలోని చల్లదనం బయటకు పోకుండా.. బయటి వేడి గాలి లోపలికి రాకుండా ఉంటుంది. ఒక్కోసారి కిటికీల నుంచి పడే వేడి వెలుతురు వల్ల.. గదిలోని ఉష్ణోగ్రత ప్రభావితం కావొచ్చు. కాబట్టి కిటికీలను కప్పి ఉంచడానికి మందపాటి కర్టెన్స్ వాడండి. అలాగే తలుపుల కింద ఖాళీలను ఫిల్ చేయడానికి డోర్ సీల్స్ ఉపయోగించండి.
ఏసీ ఫిల్టర్లలో దూళి పేరుకుపోతే, గాలిని లాక్కోవడానికి మోటార్ ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల కరెంటు బిల్లు పెరుగుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిల్టర్లను తీసి నీళ్లతో శుభ్రం చేయడం వల్ల ఏసీ పనితీరు మెరుగుపడుతుంది. ఇది మోటారుపై ఒత్తిడి తగ్గించి.. పవర్ బిల్లును ఆదా చేసేందుకు సాయపడుతుంది.
Also Read: Washing Machine: వాషింగ్ మిషన్ ఆన్ చేస్తున్నారా? ఈ 10 సెకన్ల టెస్ట్ చేయండి.. లేదంటే నష్టపోతారు!
రాత్రి పడుకునే సమయంలో కొందరు ఏసీని ఆన్ చేసి.. ఉదయం వరకూ అలాగే వదిలేస్తారు. ఇది విద్యుత్ బిల్లు పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రాత్రి పూట సమయం గడిచేకొద్ది వాతావరణం చల్లబడుతుంది. కాబట్టి ఏసీ ఒకే విధమైన ఉష్ణోగ్రత స్థాయిలో ఉండాల్సిన పని లేదు. కాబట్టి ‘Sleep Mode’ ఆన్ చేస్తే అది గంట గంటకూ ఉష్ణోగ్రతను స్వల్పంగా పెంచుతూ కరెంటును ఆదా చేస్తుంది. అలాగే తెల్లవారుజామున ఏసీ ఆటోమేటిక్గా ఆగిపోయేలా Timer సెట్ చేసుకోవడం మంచిది.