Raghu rama Raju Third Degree Case: మాజీ ఎంపీ రఘరామరాజు థర్డ్ డిగ్రీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఓ అడుగు ముందుకుపడితే.. మరొక అడుగు వెనక్కి వెళ్తోంది. తాజాగా బీహార్కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసు విచారణ ఇకపై వేగవంతం కానుంది.
రఘురామరాజు థర్డ్ డిగ్రీ కేసు కొత్త మలుపు
వైసీపీ హయాంలో నమోదు చేసిన కేసులు స్పీడందుకున్నాయి. మాజీ ఎంపీ రఘరామరాజు థర్డ్ డిగ్రీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బీహార్లో ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో విచారణకు రావాలని కొంతకాలంగా పలుమార్లు నోటీసులు జారీ చేశారు పోలీసులు.
ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. పరిస్థితి గమనించిన ఏపీ పోలీసులు నేరుగా రంగంలోకి దిగేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసు దర్యాప్తు జోరందుకోనుంది. వైసీపీ రూలింగ్లో ఏపీ సీఐడీలో డిప్యుటేషన్పై పని చేశారు సునీల్ నాయక్. 2021లో రఘురామకృష్ణంరాజు అరెస్టు చేసిన సమయంలో సీఐడీ కస్టడీలో సునీల్ నాయక్ నేతృత్వంలో టీమ్ ఆయన్నివిచారించింది.
సీనియర్ ఐపీఎస్ని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు
ఆ సమయంలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మాజీ ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. కాళ్లపై కొట్టడం, మానసికంగా వేధించడం వంటి చర్యల్లో సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు రఘురామరాజు.
ఈ కేసు వ్యవహారం గురించి తొలుత బీహార్ ప్రభుత్వానికి ఏపీ పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పట్నాలోని స్థానిక కోర్టులో ఆయన్ని హాజరు పరిచారు. ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్ కోరారు. న్యాయస్థానం నుంచి అనుమతి లభించడంతో ఆయన్ని సోమవారం సాయంత్రానికి గుంటూరు తీసుకురానున్నారు.
ALSO READ: తిరుమల లడ్డూ ఇష్యూ.. వైసీపీకి సుప్రీంకోర్టులో దక్కని రిలీఫ్
సునీల్ నాయక్ అరెస్టుతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్టు ఈ కేసుతో స్పష్టమైంది. ఇదే కేసులో మరికొందరు ఉన్నతాధికారులు విచారణ చేసే అవకాశమున్నట్లు అమరావతి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.