Termite Mounds: ఇప్పుడు కాస్తున్న ఎండలను తట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. తప్పకుండా ఏసీ లేదా కూలర్ ఉండాల్సిందే. ఇక ఆఫీసుల్లో అయితే 24 x 7 ఏసీలు రన్ చేయాల్సిందే. లేకపోతే పని ముందుకు సాగదు. అలాగే సిస్టమ్స్ కూడా వేడెక్కిపోతాయి. ఒక వేళ పవర్ కట్ అయితే? వామ్మో.. ఊహించుకుంటేనే భయం వేస్తోంది కదూ. అయితే, జింబాబ్వేలోని ఆ భవనంలో ఉండేవారికి మాత్రం ఎలాంటి టెన్షన్స్ ఉండవు. ఎందుకంటే.. వారికి ఏసీలతో అస్సలు పనే లేదు. ఎండల తీవ్రత ఎంత పెరిగినా సరే.. ఆ భవనం లోపల మాత్రం చల్లదనం ఉంటుంది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇందుకు కారణం చెదపురుగులే.
ఆఫ్రికాలో ఎండలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా జింబాబ్వే లాంటి దేశాల్లో ఎండలు మండిపోతూ ఉంటాయి. అక్కడి ఎండల నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అయితే, అక్కడి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే. అందుకే, వారు ఏసీలకు పెద్ద ఖర్చు పెట్టరు. కేవలం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, సంపన్నులు మాత్రమే ఏసీలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే జింబాబ్వే రాజధాని హరారేలో ఉన్న ‘ఈస్ట్గేట్ సెంటర్’ (Eastgate Centre) మాల్లో ఒక్క ఏసీ కూడా ఉండదు. ఇందులోని ఆఫీసుల్లో సైతం ఏసీలు వాడరు. మరీ అంత పొదుపా అనుకోవద్దు. ఎందుకంటే.. ఈ భవనానికి ఏసీ అవసరం లేదు. సహజ సిద్ధంగానే చల్లబడుతుంది. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఇలా..
ఈ భవనం ఆర్కిటెక్చర్ చరిత్రలోనే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఈస్ట్గేట్ సెంటర్.. ఒక బయోమిమిక్రీ కట్టడం. అంటే.. ప్రకృతిని స్ఫూర్తిగా తీసుకుని నిర్మించిన కట్టడం అని అర్థం. పక్షులను చూసి విమానం, కింగ్ ఫిషర్ పక్షి ముక్కును చూసి బుల్లెట్ ట్రైన్ను ఎలా డిజైన్ చేసినట్లుగా.. చెద పురుగులను చూసి ఈ భవనాన్ని రూపొందించారు.
1990లో ప్రముఖ ఆర్కిటెక్ట్ మిక్ పియర్స్.. హరారే నగరంలో ఒక పెద్ద వాణిజ్య సముదాయాన్ని నిర్మించాలని అనుకున్నారు. అయితే, ఆ భవనం పర్యావరణానికి హాని చేయని విధంగా ఉండాలని భావించారు. ఆ సమయంలో ఆఫ్రికా అడవుల్లోని చెద పురుగుల గూళ్లు ఆయన్ని ఆకట్టుకున్నాయి. కొన్నాళ్లు ఆయన ఆ గూళ్లను పరిశీలించి కీలక విషయాలు తెలుసుకున్నారు. వాటి నిర్మాణ ఫార్ములాను గ్రీన్ బిల్డింగ్ (Green Building) నిర్మాణాలకు ఉపయోగించుకోవచ్చని భావించారు.
ఆఫ్రికాలో పగటి ఉష్ణోగ్రతలు ఎంత ఎక్కువగా ఉంటాయో.. రాత్రి వేళ్లల్లో అంత తగ్గిపోతాయి. అక్కడ ఎంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ.. చెదపురుగులు.. తాము నివసించే గూళ్లలో ఎప్పుడూ ఒక విధమైన చల్లదనాన్ని ఆస్వాదిస్తాయి. సుమారు 30 డిగ్రీల సెల్సియస్ నుంచి 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండేలా అవి గూళ్లను నిర్మించుకుంటాయి. ఇందుకు అవి తమ గూటి కింద చుట్టుపక్కలా చిన్న చిన్న రంథ్రాలు ఏర్పాటు చేసుకుంటాయి. వాటి ద్వారా భూమికి దగ్గరగా ఉండే చల్లని గాలి గూటిలోకి వస్తుంది. వేడి గాలి బయటకు పోయేందుకు వీలుగా గూడు మధ్యలో ఒక చిమ్నీ లాంటి నిలువు నిర్మాణం ఉంటుంది. గూటి లోపల ఉండే చెదపురుగుల కదలికలు, వాటి శ్వాసక్రియ ద్వారా ఏర్పడే వేడి గాలి.. ఆ చిమ్నీ ద్వారా బయటకు పోతుంది. ఈ ప్రక్రియనే పాసివ్ కూలింగ్ లేదా స్టాక్ ఎఫెక్ట్ అని అంటారు.
ఆర్టిటెక్ట్ మిక్ పియర్స్.. ఈ చెదపురుగుల ఫార్ములాను ఈస్ట్ గేట్ సెంటర్ నిర్మాణానికి ఉపయోగించారు. ఎయిర్ కండిషనర్ల అవసరం లేకుండా బిల్డింగ్ను డిజైన్ చేశారు. ఈ భవనం రెండు దశల్లో చల్లబడుతుంది. రాత్రి పూట బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, భవనం బేస్మెంట్లో ఉండే హై-పవర్ ఫ్యాన్లు చల్లదనాన్ని లోపలికి లాగుతాయి. ఆ తర్వాత భవనం అంతటా ఉన్న డక్టుల ద్వారా ఈ గాలి ప్రవహించి, కాంక్రీట్ స్లాబ్లు, గోడలు చల్లబడతాయి. కాంక్రీట్కు వేడిని/చల్లదనాన్ని పట్టి ఉంచే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రి జరిగిన ప్రక్రియ వల్ల బిల్డింగ్ మొత్తం ఒక పెద్ద ఐస్ బ్లాక్లా మారుతుంది. పగటి వేళ బయట ఎంత ఎండ ఉన్నా.. రాత్రి చల్లబడిన కాంక్రీట్ గోడలు ఆ వేడిని భవనం లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటాయి. ఆఫీసులో కంప్యూటర్లు, లైట్లు, మనుషుల వల్ల వచ్చే వేడి గాలి.. తేలికై పైకి ప్రవహిస్తుంది. భవనంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 48 సిరామిక్ చిమ్నీల ద్వారా ఈ వేడి గాలి బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి.. ఆ భవనంలో వేడి అనేదే ఉండదు.
Also Read: ‘కెనడియన్ బావి’ వింత.. పెరట్లో పైపులు పాతి.. ఇల్లంతా కూల్గా మార్చేశాడు!
భారీ మాల్స్ లేదా ఆఫీసులు నిర్మించేప్పుడు సెంట్రల్ ఏసీలు ఏర్పాటు తప్పనిసరి. ఇందుకు రూ.కోట్లు ఖర్చవుతాయి. అంతేకాదు.. ఆ తర్వాత ఏసీ బిల్లులు కూడా వాచిపోతాయి. అయితే, ఈస్ట్ గేట్ సెంటర్కు ఆ సమస్య లేదు. అందుకే ఆ భవనంలోని షాపులు, ఆఫీసుల రెంట్లు కూడా చాలా తక్కువ. ఏసీలు పర్యావరణానికి చాలా నష్టం కలిగిస్తాయి. కార్బన్ ఉద్గారాలను వదులుతాయి. అయితే, ఈ భవనం మాత్రం పర్యవరణహితం. ఇక్కడి గాలి నిరంతరం మారుతూ ఉంటుంది. దీని వల్ల లోపల ఉండే వారికి ‘సిక్ బిల్డింగ్ సిండ్రోమ్’.. అంటే తాజా గాలి లేకపోవడం వల్ల వచ్చే అలసట, తలనొప్పి వంటి సమస్యలు రానేరావు. దాదాపు 90 శాతం విద్యుత్ ఆదా అవుతోంది. ఏసీలు ఏర్పాటు చేయకపోవడం వల్ల సుమారు రూ.29 కోట్ల ఖర్చు మిగిలినట్లు ఎకో-ఫ్రెండ్లీ ఆర్కిటెక్చర్ మిక్ పియర్స్ తెలిపారు.