భారతదేశ ఐటీ రంగంలో గత కొన్ని దశాబ్దాలుగా బెంగళూరు, హైదరాబాద్ నగరాలదే హవా నడుస్తోంది. అయితే లింక్డ్ఇన్ విడుదల చేసిన ఏప్రిల్ 2026 లేబర్ మార్కెట్ నివేదిక సరికొత్త మార్పులను వెల్లడించింది. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాల విస్తరణ ఇప్పుడు కేవలం ఈ రెండు నగరాలకే పరిమితం కాలేదు.. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరం ఏఐ ఉద్యోగ కల్పనలో అనూహ్య వృద్ధిని నమోదు చేస్తూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
గణాంకాల ప్రకారం చూస్తే.. బెంగళూరు ఇప్పటికీ ఇండియా ఏఐ క్యాపిటల్ సిటీ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అక్కడ సుమారు 3.0 శాతం మంది ఏఐ ఇంజనీరింగ్ స్కిల్స్ ను కలిగి ఉన్నారు. ఈ సంఖ్య అంతర్జాతీయ స్థాయిలో శాన్ ఫ్రాన్సిస్కోతో సమానంగా ఉంది. బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ నగరం తర్వాత ప్రపంచంలోనే బలమైన ఏఐ హబ్గా బెంగళూరు నిలుస్తోంది. అయితే ప్రస్తుతం అసలు కథ బెంగళూరు వెలుపల వేగంగా సాగుతున్న అభివృద్ధిలో కనిపిస్తోంది.
హైదరాబాద్ నగరం ఏఐ ఉద్యోగ ప్రకటనలలో 51.0 శాతం వార్షిక వృద్ధిని సాధించి తన సత్తా చాటుకుంది. కాగా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా విజయవాడలో ఈ వృద్ధి రేటు ఏకంగా 45.5 శాతంగా నమోదైంది. సాధారణంగా అగ్రశ్రేణి టెక్ నగరాల జాబితాలో విజయవాడ పేరు ఎక్కువగా వినిపించదు. కానీ తాజా డేటా ప్రకారం.. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ మార్కెట్లలో విజయవాడ ఒకటిగా నిలిచింది. ఇక్కడి ఏఐ ప్రతిభ సాంద్రత 1.7 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు 1.0 శాతం కంటే మెరుగ్గా ఉండటం విశేషం.
జాతీయ స్థాయిలో ఏఐ ఉద్యోగాల వృద్ధి రేటు 59.5 శాతానికి చేరుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బెంగళూరు నగర వృద్ధి రేటు 52.3 శాతం కంటే దేశవ్యాప్త సగటు ఎక్కువగా ఉంది. అంటే బెంగళూరు లో కంటే దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏఐ నిపుణుల అవసరం శరవేగంగా పెరుగుతోంది. టెక్ కంపెనీలు తమ కార్యకలాపాలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్న తీరుకు ఇది నిదర్శనంగా కనిపిస్తోంది.
ఉద్యోగార్ధులకు ఈ పరిణామం పెద్ద ఊరటనిస్తోంది. బెంగళూరు వంటి నగరాల్లో ఉండే అధిక జీవన వ్యయం అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సొంత ప్రాంతాలకు దగ్గరగా కెరీర్ను నిర్మించుకునే అవకాశం లభిస్తోంది. కంపెనీలకు సైతం తక్కువ వేతనాలకే నైపుణ్యం కలిగిన సిబ్బంది అందుబాటులోకి వస్తున్నారు. టాలెంట్ వార్స్ కారణంగా పెరిగే ఆర్థిక భారం తగ్గుతుంది.
లింక్డ్ఇన్ రిపోర్ట్ ఆధారంగా భారత్ టెక్ రంగంలో రెండో దశ అభివృద్ధిలోకి అడుగు పెట్టిందని స్పష్టమవుతోంది. బెంగళూరు నాయకత్వం వహిస్తున్నా హైదరాబాద్ తన పట్టు పెంచుకుంటోంది. విజయవాడ వంటి నగరాల ఆవిర్భావం భవిష్యత్తులో ఐటీ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. రాబోయే కాలంలో మరిన్ని చిన్న నగరాలు ఏఐ హాట్స్పాట్లుగా మారే సూచనలు బలంగా ఉన్నాయి.
ALSO READ: తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు.. తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్?