Hydrogen Train: భారతీయ రైల్వే చరిత్రలోనే కాదు, దేశ రవాణా రంగంలోనే ఇదొక చారిత్రాత్మక మైలురాయి. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు (India’s First Hydrogen Train) పట్టాలెక్కడానికి సర్వం సిద్ధమైంది. హర్యానాలోని జింద్ – సోనిపట్ రూట్లో నడవబోయే ఈ గ్రీన్ రైలు కమర్షియల్ సర్వీసులకు రైల్వే బోర్డు అధికారికంగా ఆమోద ముద్ర వేసింది.
‘ఆత్మనిర్భర్ భారత్’, ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ లో భాగంగా రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రైలును రూపొందించారు.
అత్యంత పొడవైన రైలు: బ్రాడ్ గేజ్ (Broad Gauge) ట్రాక్పై నడిచే ప్రపంచంలోనే అత్యంత పొడవైన, శక్తివంతమైన హైడ్రోజన్ రైలు ఇదే కావడం విశేషం.
కోచ్ల అమరిక: ఈ రైలులో మొత్తం 10 కోచ్లు ఉంటాయి. వీటిలో రెండు డ్రైవింగ్ పవర్ కార్లు (DPCs – ఒక్కొక్కటి 1200 kW సామర్థ్యం) కాగా, మిగిలిన 8 సాధారణ ప్యాసింజర్ కోచ్లు.
వేగం: జింద్ – సోనిపట్ రూట్లో ఈ రైలు గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల (75 kmph) వేగంతో ప్రయాణించడానికి రైల్వే బోర్డు అనుమతిని ఇచ్చింది.
DPRS టెక్నికల్ అడ్వాంటేజ్: ఇది ‘డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్’ సాంకేతికతతో పనిచేస్తుంది. దీనివల్ల రైలుకు త్వరితగతిన వేగం పుంజుకునే (Acceleration), అలాగే వేగాన్ని తగ్గించే (Deceleration) సామర్థ్యం లభిస్తుంది.
హైడ్రోజన్ రైళ్ల నిర్వహణ అత్యంత సవాలుతో కూడుకున్నది. దీనికోసం రైల్వే శాఖ ప్రత్యేక మౌలిక వసతులను ఏర్పాటు చేసింది.
స్వదేశీ హైడ్రోజన్ ప్లాంట్: రైలు ప్రారంభమయ్యే హర్యానాలోని ‘జింద్’ లో ఒక అధునాతన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను నిర్మించారు. వాటర్ ఎలక్ట్రోలిసిస్ ప్రక్రియ ద్వారా ఇక్కడ పర్యావరణహిత హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసి రైలుకు రీఫ్యూయలింగ్ చేస్తారు.
సేఫ్టీ మెయింటెనెన్స్ ప్రోటోకాల్: ఈ రైలు పీరియాడిక్ మెయింటెనెన్స్ ఢిల్లీలోని శాకూర్ బస్తీ డిపోలో జరుగుతుంది. అయితే, కఠినమైన భద్రతా నిబంధనల ప్రకారం.. జింద్ నుండి శాకూర్ బస్తీకి మెయింటెనెన్స్ కోసం తరలించే సమయంలో హైడ్రోజన్ పవర్ సిస్టమ్ను పూర్తిగా ఆపేసి , డీజిల్ ఇంజన్ సహాయంతోనే లాగాల్సి ఉంటుంది.
సాంప్రదాయ డీజిల్ రైళ్లతో పోలిస్తే హైడ్రోజన్ రైళ్లు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి.
జీరో కార్బన్ ఎమిషన్స్
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా నడిచే ఈ రైలు ఎలాంటి హానికర వాయువులను విడుదల చేయదు. కెమికల్ రియాక్షన్ ద్వారా విద్యుత్ తయారయ్యాక, ఈ రైలు సైలెన్సర్ నుండి కాలుష్య పొగకు బదులు కేవలం నీటి ఆవిరి మాత్రమే పర్యావరణంలోకి విడుదలవుతుంది.
ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రైల్వే బోర్డు ఆమోదంతో పాటు, కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (CCRS) పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO) నుండి కూడా అన్ని రకాల క్లియరెన్సులు లభించాయి.
మొదటి మూడు నెలల పాటు ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే తక్షణమే స్పందించడానికి ప్రత్యేక శిక్షణ పొందిన టెక్నికల్ గ్రూప్ నిరంతరం ఈ రైలులోనే ప్రయాణించనుంది. ప్రస్తుతం తుది తనిఖీలు, లోకో పైలట్ల శిక్షణ ముగింపు దశకు చేరుకున్నాయి. రాబోయే రెండు నెలల్లోనే ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, జర్మనీ, చైనా వంటి దేశాల సరసన హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న అగ్ర దేశాల జాబితాలో భారత్ చేరనుంది.