Data Centers: డేటా సెంటర్ల మార్కెట్ అత్యంత వేగంగా భారత్లో విస్తరిస్తోంది. గ్లోబల్ డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో మరో అడుగు వేసింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారత్ రెండో అతిపెద్ద డేటా సెంటర్ మార్కెట్గా నిలిచింది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ విడుదల చేసిన తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
డేటా సెంటర్ల హబ్గా భారత్.. ఆసియా-పసిఫిక్లో సెకండ్ ప్లేస్
డేటా సెంటర్లకు హబ్గా మారింది భారత్. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 1.6 గిగావాట్ల సామర్థ్యంతో భారత్ రెండవ అతిపెద్ద డేటా సెంటర్ మార్కెట్గా నిలిచింది. ఇంకా నిర్మాణం, ప్రణాళికలో దాదాపు 3.1 గిగావాట్ల సామర్థ్యం రెడీ అవుతోంది. ఓవరాల్ గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా టాప్ -3 మార్కెట్లలో భారత్ ది సెకండ్ ప్లేస్.
ఈ విషయాన్ని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృత్రిమ మేధ వినియోగం, హైపర్స్కేల్ క్లౌడ్ విస్తరణ, సంస్థల నుంచి డిమాండ్ ఉండడంతో భారత్ డిజిటల్ మౌలిక సదుపాయాలకు కీలక కేంద్రంగా మారుతోందన్నది ఆ నివేదిక సారాంశం. దీని వెనుక ముంబై, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, పుణె, బెంగళూరు వంటి నగరాలు దన్నుగా నిలుస్తున్నాయి.
ముంబై తర్వాత హైదరాబాద్ కు అరుదైన ఘనత
భారత్ డేటా సెంటర్ల మార్కెట్కు ముంబై కేంద్రంగా మారింది. ఈ ఏడాది చివరినాటికి ముంబై ఒక గిగావాట్ సామర్థ్యాన్ని అధిగమిస్తుందని ఓ అంచనా. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, పుణె వంటి మెట్రో- ద్వితీయ శ్రేణి మార్కెట్లు ఈ వృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నాయి. హైదరాబాద్ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో టాప్ సెకండరీ మార్కెట్గా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదో స్థానం దక్కించుకుందని ప్రస్తావించింది. డేటా సెంటర్ల ల్యాండ్ స్కేప్లో హైదరాబాద్ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూనే, బెంగళూరును తృతీయ శ్రేణి మార్కెట్గా పేర్కొంది. భారత్ దీర్ఘకాలిక విస్తరణ ప్రణాళికలు ఆశాజనకంగా ఉన్నాయని, భవిష్యత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఆపరేటర్లు పెద్ద ఎత్తున భూములను సేకరిస్తున్నట్లు వెల్లడించింది.
ALSO READ: జియో సరికొత్త ప్లాన్.. రూ.200కే 15 ఓటీటీలు.. 1000 టీవీ ఛానెల్స్ ఫ్రీ!
ప్రస్తుతం 10.5 గిగావాట్లకు పైగా సామర్థ్యం భూమి దశలో ఉందని తెలిపింది. రాబోయే రోజుల్లో భారీ అభివృద్ధికి ఇదొక సంకేతమని అందులో ప్రస్తావించింది. ఈ సందర్భంగా కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మాట్లాడారు. ప్రపంచ డేటా సెంటర్ రంగం వృద్ధిలో కొత్త దశకు చేరుకుందని, డిమాండ్తో పాటు విద్యుత్ లభ్యత, మౌలిక సదుపాయాలు, నిర్మాణ సామర్థ్యం అత్యంత కీలకంగా మారినట్టు వివరించారు. ఈ మార్పులకు అనుగుణంగా భారత్ పటిష్ఠమైన స్థితిలో ఉందన్నారు.