Solar Eclipse: అప్పుడప్పుడూ మన చుట్టూ జరిగే కొన్ని అద్భుతాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి అరుదైన సంఘటనే అంతరిక్షంలో జరగబోతోంది. అవును మీరు విన్నది నిజమే! రాబోయే 2027 ఆగస్టు 2న సంభవించబోయే సూర్యగ్రహణం మనల్ని మరింత ఆశ్చర్యంలో ముంచెత్తబోతోంది. ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 100 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేనంత ఎక్కువ సమయం పాటు ఈ గ్రహణం భూమిని కమ్మేయనుందట.
సాధారణంగా సూర్యగ్రహణాల సమయంలో చీకటి కొన్ని సెకన్లు లేదా రెండు మూడు నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. కానీ ఈసారి చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేసే సంపూర్ణ గ్రహణం సమయం గరిష్టంగా 6 నిమిషాల 23 సెకన్ల పాటు ఉండనుందట. చంద్రుడు భూమికి కాస్త దగ్గరగా ఉండటం వలన ఆకాశంలో చంద్రబింబం పెద్దదిగా కనిపిస్తూ సూర్యుడిని ఎక్కువ సేపు మూసివేయడమే దీనికి ప్రధాన కారణం. సూర్యుడి చుట్టూ ఉండే కరోనా అనే ప్రకాశవంతమైన భాగాన్ని పరిశోధించడానికి శాస్త్రవేత్తలకు ఇది ఒక గొప్ప అవకాశం.
Also Read: బోరింగ్ వర్కౌట్స్తో విసుగొస్తుందా.. అయితే మ్యూజిక్ వింటూ స్టెప్పులేయండి!
ఈ అద్భుత దృశ్యం యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లో అద్భుతంగా ఆవిష్కృతం కానుంది. ముఖ్యంగా స్పెయిన్, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్ దేశాల్లో చీకటి కమ్ముకుంటుంది. సౌదీ అరేబియా, యెమెన్, సోమాలియా దేశాల మీదుగా కూడా ఈ గ్రహణ మార్గం సాగుతుంది.
ఈ గ్రహణం సమయంలో ప్రపంచం దృష్టి మొత్తం ఈజిప్టులోని లక్సర్ నగరం మీదే ఉంటుంది. ఎందుకంటే.. ఇక్కడే అత్యంత సుదీర్ఘమైన చీకటి సమయం నమోదవుతుంది. దీనితో పాటు స్పెయిన్లోని కాడిజ్, జిబ్రాల్టర్, మొరాకోలోని టాంగియర్స్, లిబియాలోని బెంగాజీ, సౌదీ అరేబియాలోని జెడ్డా నగరాల్లో పగలే నక్షత్రాలు కనిపించేంత చీకటి ఏర్పడుతుంది. ఈ చారిత్రక క్షణాలను చూడటానికి ఇప్పటికే పర్యాటకులు, శాస్త్రవేత్తలు ఆయా ప్రాంతాల్లో హోటల్స్ బుక్ చేసుకుంటున్నారు.
మన దేశంలోని ఖగోళ ప్రేమికులకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే. భారతదేశంలో ఇది సంపూర్ణ సూర్యగ్రహణంగా కనిపించదు. ఇక్కడ కేవలం పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే కనిపిస్తుంది. అంటే.. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పకుండా కొంత భాగాన్ని మాత్రమే మూసివేస్తాడు. కాబట్టి.. భారత్లో చీకటి పడదు, కానీ సూర్యుడు నెలవంక ఆకారంలో కనిపిస్తాడు.
సంపూర్ణ గ్రహణం ఏర్పడిన ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. పక్షులు, జంతువులు రాత్రి అయ్యిందేమోనని అయోమయానికి గురై తమ నివాసాలకు చేరుకుంటాయి. ఆకాశంలో ప్రకాశవంతమైన గ్రహాలు, నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. అయితే ఈ దృశ్యాన్ని చూడాలనుకునే వారు తప్పనిసరిగా సర్టిఫైడ్ సోలార్ ఫిల్టర్లు లేదా గ్రహణ కళ్లద్దాలను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. నేరుగా సూర్యుడిని చూడటం కళ్లకు చాలా ప్రమాదకరం. ఈ 2027 సూర్యగ్రహణం కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు.. ఇది తరానికి ఒకసారి మాత్రమే కనిపించే అద్భుత దృశ్యం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: విలాసవంతమైన కోరికలకు కళ్లెం వేయకుంటే.. మిమ్మల్ని చుట్టుముట్టే సమస్యలివే!