Frauds : స్కామ్స్, ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్.. ఇలా పేరు ఏదైనా జరిగేది మాత్రం మోసమే. ఇప్పటికే ఆన్లైన్ వేదికగా ఎన్నో స్కామ్స్ జరుగుతుండగా.. తాజాగా మరో స్కామ్ బయటపడింది. ఓ పోస్ట్ మాస్టర్ ను వలలో వేసుకున్న స్కామర్స్.. అతని నుండి భారీ నగదును దోచేశారు. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది? ఎక్కడ జరిగిందంటే..!
ఆన్లైన్ స్కామ్లు సర్వసాధారణం అవుతున్న ఈ రోజుల్లో ఎవరైనా జాగ్రత్తగా లేకుంటే బాధితులు కావచ్చు. ఆన్లైన్ లోన్ స్కామ్లో ఇరుక్కున్న లూథియానాకు చెందిన పోస్ట్మాస్టర్ రూ. 87,000 పోగొట్టుకున్నాడు. ఫ్లిప్కార్ట్ మొబైల్ యాప్ ద్వారా సరబ్జిత్ నవంబర్ 27న రూ.2 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. డిసెంబరు 4న యాప్కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలుపుతూ ఒకరి నుండి అతనికి కాల్ వచ్చింది. అతని లోన్ కు అప్రూవల్ లభించిందని.. KYC వివరాలు మాత్రం సగంలోనే ఆగిపోయాయని అందుకే డబ్బులు బదిలీ చేయలేమని తెలిపారు.
ఇక ఈ ఫోన్ కాల్ తర్వాత సరబ్జిత్ వాళ్ళు చెప్పింది అంతా నిజమేనని నమ్మేశాడు. దీంతో స్కామర్ సరబ్జిత్కు ఓ లింక్ను పంపాడు. ఆన్లైన్ ఫారమ్ను పూరించమని, KYC ఛార్జీగా రూ. 5 చెల్లించమని సూచించాడు. ఈ సూచనలను అనుసరించి, సరబ్జిత్ లింక్ను క్లిక్ చేసి ఫామ్ ను ఫిల్ చేశాడు. ఈ చిన్న మెుత్తమును చెల్లించడానికి ప్రయత్నించేటప్పటికి.. అతని ఖాతా నుంచి షాకింగ్గా రూ.86,998 డెబిట్ అయిపోయాయి.
తాను మోసపోయానని గ్రహించిన సరబ్జిత్ జాగ్రావ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అయితే “KYC ప్రక్రియను పూర్తి చేయమని నన్ను అడిగిన వ్యక్తికి నేను వెంటనే కాల్ చేసాను. అతను కాల్ లిఫ్ట్ చేశాడు. ఆపై నేను ఈ విషయం గురించి ప్రశ్నించగానే కాల్ డిస్కనెక్ట్ చేసి, ఆపై నంబర్ను స్విచ్ ఆఫ్ చేసాడు..” అని సరబ్జిత్ తెలిపాడు.
అయితే ఎక్కడికి అక్కడ ఎలాంటి మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తమని తాము రక్షించుకోవడం అత్యవసరం. అందుకే కచ్చితంగా సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ నుంచి రక్షించుకోవాలంటే కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.
⦿ నిజానికి ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు అసలు కాల్ చేసిన వ్యక్తి ఎవరు అనే విషయాన్ని పూర్తిగా నిర్ధారించుకోవాలి.
⦿ యాప్ లేదా ఏదైనా అధికారి వెబ్సైట్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పినప్పుడు కస్టమర్ కేర్ ను సంప్రదించాలి.
⦿ తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్ ఎట్టి పరిస్థితుల్లోనే క్లిక్ చేయకూడదు. ఇలాంటి వాటి ద్వారా మాల్వేర్ ఫోన్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. దీంతో వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
⦿ నిజానికి విశ్వసనీయ యాప్స్ ను ఉపయోగించడం అత్యవసరం. అధికారిక యాప్ స్టోర్స్ నుంచి మాత్రమే ఏమైనా యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ అప్లికేషన్ను వీలైనంత వరకు నివారించడం మంచిది.
⦿ లావాదేవీలు చేయాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
⦿ బ్యాంక్ స్టేట్మెంట్స్ ను క్రమం తప్పకుండా తనఖీ చేయాలి.
⦿ అనధికార లావాదేవీలను వెంటనే ఆపేయాలి.
⦿ ఎవరైనా డబ్బులు పంపించమని లింకు పంపితే ఆ విషయాన్ని నమ్మొద్దు.
⦿ సాధారణ స్కామ్స్ కోసం ప్రతీ ఒక్కరూ ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలి. తమకు తెలిసినా సైబర్ సెక్యూరిటీ విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల జరిగే అనర్ధాలను ఆపే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతీ ఒక్కరూ ఈ రోజుల్లో జరుగుతున్న డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉంటే ఇలా మోసపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ALSO READ : వీటిలో బెస్ట్ మెుబైల్ ఏది? లాంఛ్, ప్రైజ్, స్పెసిఫికేషన్స్ వివరాలివే!