New CCTV Rules 2026: ప్రస్తుతం దేశంలో సీసీటీవీ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సాధారణ ఇళ్లు, దుకాణాల నుంచి బ్యాంకులు, అతిపెద్ద కార్పోరేట్ సంస్థల వరకూ ప్రతీ ఒక్కరు భద్రత కోసం ఈ సీసీటీవీలను వినియోగిస్తున్నారు. అయితే కెమెరాలు రికార్డు చేసే డేటా.. దుర్వినియోగం అవుతున్నట్లు కేంద్రం దృష్టికి వెళ్లింది. ముఖ్యంగా చైనాకు చెందిన సీసీటీవీ తయారీ కంపెనీలపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఇంటర్నెట్-కనెక్టెడ్ (IP) సీసీటీవీ కెమెరాల విక్రయాలపై కఠినమైన నిబంధనలను అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. దీంతో చైనీస్ బ్రాండ్స్.. భారత్ లో సీసీటీవీలు విక్రయించడం దాదాపుగా నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ నిబంధనల పరిధిలోకి సీసీటీవీలను సైతం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏప్రిల్ 1 నుండి దేశంలో అమ్మకాలు జరిపే ప్రతీ సీసీటీవీ కెమెరాకు ‘స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్’ (STQC) తప్పనిసరి. సీసీటీవీ కెమెరాల్లో ఉపయోగించే చిప్ సెట్ ఏ దేశంలో తయారైందో సదరు కంపెనీలు స్పష్టంగా కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనధికార రిమోట్ యాక్సెస్, డేటా చోరీ వంటి కఠినమైన భద్రతపరీక్షలను ఆయా కంపెనీల కెమెరాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం చైనాకు చెందిన ప్రముఖ బ్రాండ్లు హిక్ విజన్ (Hikvision), దహువా (Dahua) కంపెనీలు భారత్ లో పెద్ద ఎత్తున సీసీటీవీ కెమెరాలను విక్రయిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న నిబంధనలు.. ఈ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇప్పటికే చైనా చిప్ సెట్ తో తయారైన సీసీటీవీలకు ‘స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్’ ను కేంద్రం ఇవ్వడం లేదు. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఆ కంపెనీలకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల విక్రయాలు దేశంలో నిలిచిపోనున్నాయి.
ఏప్రిల్ 1 తర్వాత కొత్తగా సీసీటీవీ కెమెరా కొనుగోలు చేయాలని భావించేవారు.. కొన్ని విషయాలను తప్పనిసరిగా పరిశీలించాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. కొనబోయే సీసీటీవీ కెమెరా బీఐఎస్ (Bureau of Indian Standards), STQC గుర్తింపు కలిగి ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా పాత చైనా మోడళ్లలో డీఫాల్ట్ పాస్ వర్డ్ లు, రిమోట్ యాక్సెస్ రిస్క్ ఎక్కువగా ఉండేదని భద్రతా నిపుణులు చెబుతున్నారు. కొత్త నిబంధన ప్రకారం రాబోయే కెమెరాల్లో డేటా ఎన్క్రిప్షన్, సెక్యూర్ లాగిన్ ఫీచర్లు కచ్చితంగా ఉండనున్నాయి. ఇది భద్రతాపరంగా గొప్ప పురోగతిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
చైనా చిప్ సెట్ లను అమోదించని నేపథ్యంలో.. దేశీయ తయారీ కంపెనీలు వాటికి ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో తైవాన్, అమెరికా చిప్ సెట్ లను వాడాల్సి రావొచ్చు. ఫలితంగా సీసీటీవీ ధరలు 15-20 శాతం వరకూ పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్ లో స్వదేశీ బ్రాండ్స్ గా ఉన్న సీపీ ప్లస్ (CP Plus),క్యూబో (Qubo), ప్రామా (Prama), మ్యాట్రిక్స్ (Matrix) తదితర కంపెనీలు.. కేంద్రం నిబంధనలు క్రమం తప్పకుండా అమలు చేస్తున్నందున ఏప్రిల్ 1 నుంచి వీటి విక్రయాలు భారీగా పెరిగే అవకాశముంది.
Also Read: Delta Flight fire Broke: టేకాప్ అయిన కాపటికే ఇంజన్లో మంటలు.. 300 మంది ప్రయాణికుల్లో టెన్షన్, చివరకు
ఏప్రిల్ 1 నుంచి రాబోయే నిబంధనలు.. కొత్త సీసీటీవీలకు మాత్రమే వర్తించనున్నాయి. ఇప్పటికే కొని ఇళ్లు, ఆఫీసుల్లో ఫిక్స్ చేసిన వాటిపై ఇప్పటికిప్పుడు ఈ రూల్స్ ప్రభావం ఉండకపోవచ్చు. అయితే భవిష్యత్తులో వీటిని కూడా ప్రక్షాళన చేసే అవకాశమున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సెక్యూరిటీ అప్ డేట్స్ రాకపోవడం, డేటా భద్రతపై సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నందున.. లేటెస్ట్ రూల్స్ కు అనుగుణంగా ఉన్న సీసీటీవీలను మారితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: మంగళవారం పుట్టిన వారిని పోరాటయోధులు అంటారట ఎందుకో తెలుసా..?