MDR Charges on UPI: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రూపురేఖలను మార్చేసిన UPI లావాదేవీలకు సంబంధించి ఒక కీలకమైన వార్త చక్కర్లు కొడుతోంది. రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే యూపీఐ పేమెంట్స్పై తిరిగి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలపై వ్యాపారులు 0.5 శాతం వరకు ఫీజు చెల్లించాల్సి రావచ్చు. వచ్చే నెలలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ కొత్త ప్రతిపాదన వల్ల చిన్న దుకాణదారులకు ఎలాంటి నష్టం వాటిల్లదు. ఏడాదికి రూ.1.5 కోట్ల లోపు టర్నోవర్ ఉండే చిన్న వ్యాపారస్తులకు ఈ ఛార్జీల నుండి మినహాయింపు ఇవ్వనున్నారు. అంటే.. కేవలం పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు మాత్రమే ఈ అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది.
సాధారణంగా డిజిటల్ పేమెంట్స్ స్వీకరించినందుకు గానూ వ్యాపారులు బ్యాంకులు లేదా పేమెంట్ యాప్స్ సంస్థలకు చెల్లించే రుసుమునే ‘ఎండీఆర్’ అంటారు. నెట్వర్క్ నిర్వహణ, సాఫ్ట్వేర్ అప్డేట్స్, లావాదేవీల ప్రాసెసింగ్ ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వాడుకుంటారు. ప్రస్తుతానికి ఈ భారం నేరుగా కస్టమర్లపై పడకపోయినా.. వ్యాపారులు తమ వస్తువుల ధరలను కొద్దిగా పెంచే ప్రమాదం లేకపోలేదు.
Also Read: సింగిల్ ఛార్జ్తో 38 గంటల బ్యాటరీ.. హువావే నుంచి బెస్ట్ ప్రీమియం ఇయర్బడ్స్ విడుదల!
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మెజారిటీ యూపీఐ లావాదేవీలపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే.. దేశంలో జరిగే వ్యాపార లావాదేవీలలో 86% పేమెంట్స్ రూ.500 లోపే ఉంటున్నాయి. మరో 10% లావాదేవీలు రూ.501 నుండి రూ.2,000 మధ్య జరుగుతున్నాయి. కేవలం 4% లావాదేవీలు మాత్రమే రూ.2,000 మార్కును దాటుతున్నాయి. కాబట్టి.. కేవలం ఆ 4 శాతం పెద్ద పేమెంట్స్పైనే ఈ ప్రభావం ఉంటుంది.
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి 2020లో ప్రభుత్వం ఎండీఆర్ ఛార్జీలను రద్దు చేసింది. కానీ, యూపీఐ వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో బ్యాంకులు, పేమెంట్ కంపెనీలపై నిర్వహణ భారం భారీగా పెరిగింది. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఈ ఖర్చులకు సరిపోవడం లేదని బ్యాంకులు వాపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే, వ్యవస్థను సజావుగా నడపడానికి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
Also Read: 45W ఫాస్ట్ ఛార్జింగ్, 8000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి Realme C100x ఎంట్రీ.. టెక్ లవర్స్ ఫుల్ హ్యాపీ!