Skyroot Founders: సరిహద్దులు భూమికే కానీ.. సంకల్పానికి కాదని నిరూపించారు తెలుగు కుర్రాళ్లు. ప్రైవేటు అంతరిక్ష రంగంలో తెలుగు అక్షరాలతో సరికొత్త చరిత్ర లిఖించారు. నాడు తరగతి గదిలో లెక్కల పుస్తకం చూసి భయపడిన ఒక సామాన్య యువకుడు.. నేడు నింగి వైపు చూస్తూ రాకెట్లనే లెక్కించే స్థాయికి ఎదిగాడు. తెలుగువారి గుండెను గర్వంతో ఉప్పొంగేలా చేశారు. ఓటములతో కుంగిపోతున్న నేటి తరం యువతలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని, రాకెట్ వేగంతో దూసుకుపోయేలా స్ఫూర్తిని నింపిన ‘స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace)’ వ్యవస్థాపకులు, తెలుగు కుర్రాళ్లు పవన్ కుమార్ చందన, నాగ్ భరత్ గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
స్కూల్ రోజుల్లో మ్యాథ్స్ అంటేనే భయపడి, పాస్ మార్కులతో గట్టెక్కిన హైదరాబాద్ యువకుడు.. నేడు విశ్వాంతరాళంలోకి ఆర్బిటల్ రాకెట్ను పంపి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆయనే స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) సీఈఓ పవన్ కుమార్ చందన. భయం నుండి భరోసా వైపు అడుగులు వేస్తూ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన పవన్.. ఆ తర్వాత ప్రతిష్టాత్మక ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరారు. అయితే దేశంలో ప్రైవేట్ స్పేస్ రంగానికి కొత్త ఊపిరి పోయాలనే బలమైన సంకల్పంతో.. సౌకర్యవంతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలి ‘స్కైరూట్ ఏరోస్పేస్’ను 2018లో స్థాపించారు.
స్కైరూట్ సాధించిన ఈ అసాధారణ విజయంలో పవన్తో పాటు సమానంగా నిలిచిన మరో తెలుగు తేజం సంస్థ కో-ఫౌండర్, సీఓఓ నాగ భరత్. తిరుపతి, విశాఖపట్నంలలో ప్రైమరీ విద్యను పూర్తి చేసిన భరత్.. ఐఐటీ మద్రాస్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఇస్రోలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఫ్లైట్ కంప్యూటర్ ఇంజినీర్గా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో రాకెట్లకు గుండె లాంటి అవియానిక్స్, నావిగేషన్ సిస్టమ్స్ అభివృద్ధిలో అపారమైన అనుభవం సంపాదించిన భరత్.. 2018లో పవన్ చందనతో చేతులు కలిపి స్కైరూట్ ప్రయాణాన్ని ప్రారంభించారు.
ప్రపంచవ్యాప్తంగా స్పేస్ఎక్స్, రాకెట్ ల్యాబ్ వంటి అంతర్జాతీయ దిగ్గజ ప్రైవేట్ సంస్థలకు మాత్రమే సాధ్యమైన ఆర్బిటల్ రాకెట్ ప్రయోగాన్ని.. ఇప్పుడు భారత గడ్డపై స్కైరూట్ సంస్థ విజయవంతంగా సుసాధ్యం చేసింది. ‘మిషన్ ఆగమన్’ పేరుతో విక్రమ్-1 రాకెట్ ద్వారా టెక్నాలజీ డెమో పేలోడ్ను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టారు. 2022లో చేపట్టిన ‘విక్రమ్-ఎస్’ ప్రయోగం నుండి నేటి ‘విక్రమ్-1’ సక్సెస్ వరకు.. ఆపరేషన్స్ విభాగంలో నాగ భరత్ పోషించిన పాత్ర ఎంతో కీలకమైనది.
Also Read: రూ.549 ప్లాన్కు ఎయిర్టెల్ చెక్.. రేసులోకి రూ.449, రూ.699.. ఏది బెస్ట్ ఛాయిస్?
తక్కువ ఖర్చుతో అత్యాధునిక రాకెట్లు తయారు చేస్తూ భారత ప్రైవేట్ స్పేస్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు ఈ ఇద్దరు తెలుగు యువకులు. ఓటమి భయాలను అధిగమించి.. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని వీరిద్దరి ప్రయాణం నిరూపిస్తోంది. పవన్, భరత్ సక్సెస్ జర్నీ.. నేటి యువతకు గొప్ప దిక్సూచిగా నిలుస్తోంది. విక్రమ్-1 రాకెట్ ఘన విజయంతో తెలుగు శాస్త్రవేత్తల మేధోసంపత్తి, ప్రతిభ అంతర్జాతీయ వేదికపై మరోసారి సగర్వంగా చాటినట్లైంది.
Also Read: ‘విక్రమ్-1’ సక్సెస్ వెనుక తెలుగు కుర్రాళ్లు.. ఆకాశానికెత్తిన మోదీ.. మనోళ్లదే ఇదంతా..!