అంటార్కిటికా అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది తెల్లటి మంచు. మన శాస్త్రవేత్తలు.. అంతరిక్షంలో ఏం ఉన్నాయో తెలుసుకోగలిగారే గానీ.. సముద్రం అడుగున ఎలాంటి ప్రపంచం ఉంది.. వాటి రహస్యాలేమిటీ అనేవి ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. అలాగే, దట్టమైన మంచుతో కప్పబడిన అంటార్కిటిక అడుగున ఏం ఉందనేది కూడా పెద్ద మిస్టరీనే. అందుకే, ఆ రహస్యాన్ని ఛేదించే పనిలో పడ్డారు పరిశోధకులు. క్రమేనా ఉనికిని కోల్పోతున్న ఆ మంచు ఖండం అసలు రహస్యం తెలుసుకుని.. భవిష్యత్తులో జరగబోయే విపత్తులను అంచనా వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను తెలుసుకున్నారు.
సాధారణంగా మంట మీద ఐసు ముక్క పెడితే అది నీరులా కరిగిపోతుంది. కానీ, అంటార్కిటికాలో అలా కాదు.. ఆ ఖండం ఉన్నదే మంట మీద.. అయినా సరే పైకి చాలా ప్రశాంతంగా.. అక్కడ ఏమీ జరగనట్లు కనిపిస్తుంది. చైనాకు చెందిన ఇంటర్నేషనల్ రీసెర్చ్ టీమ్ ఇటీవల జరిపిన పరిశోధనల్లో ఆ మంచు ఖండం కింద సుమారు 207 అగ్ని పర్వతాలను గుర్తించారట. పైగా అవేమీ సైలెంటుగా లేవు.. ఇంకా యాక్టీవ్ గానే ఉన్నాయ్. అప్పుడప్పుడు బద్దలై లావాను కూడా వెదజల్లుతున్నాయట. అయినా సరే.. అంటార్కిటికా ఖండం చెక్కుచెదరకపోవడానికి కారణం.. అక్కడి ఉన్న అతి శితోష్ణస్థితి. పైగా ఆ అగ్నిపర్వతాలపై కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు మంచు పేరుకుపోయింది. దానివల్ల అగ్నిపర్వతం పేలినా.. దాని ఇంపాక్ట్ పెద్దగా కనిపించదు. కానీ, చాపకింద నీరులా.. జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంటుంది.
వాస్తవానికి అంటార్కిటికాను చూస్తే.. తెల్లని తివాచీలా కనిపిస్తుంది. ఆ ఖండం చుట్టూ ఉన్నా సముద్రం కూడా బాగా గడ్డకట్టేసి రాయిలా.. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ కింద మాత్రం పెద్ద లోకమే ఉందట. అది పర్వతాలు, అగ్నిపర్వతాలతో నిండి ఉందట. దానిపై పెద్ద ఎత్తున మంచు గడ్డకట్టేసి ఉందట. ఆ మంచుగానీ కరిగితే.. భూమికి పెను విపత్తు తప్పదు. ఇప్పటికిప్పుడు ఆ ముప్పు లేకపోయినా.. భవిష్యత్తులో మాత్రం చూడాల్సి రావచ్చు. ఎందుకంటే.. అంటార్కిటికాలో మంచు కరగడం మొదలైంది కాబట్టి. ఒక వైపు గ్లోబల్ వార్మింగ్.. మరోవైపు అంటార్కిటికా కింద ఉనికిలో ఉన్న అగ్నిపర్వతాలు.. భవిష్యత్తులో భారీ విధ్వంసానికి స్కెచ్ గీస్తున్నాయి. మంచు కింద పేలుతున్న అగ్నిపర్వతాల ప్రభావం మనకు బయటకు కనిపించడం లేదు. పర్వతాలు పేలేప్పుడు ఎగసిపడే అగ్నిజ్వాలలు ఆ మంచును అడుగు నుంచి కరిగించుకుని వస్తున్నాయి. అంటే.. ఐసును మనం మంట మీద పెట్టినప్పుడు.. ఏవిధంగా కింద నుంచి కరుగుతూ వస్తుందో.. అలా అంటార్కిటికా ఖండం కరిగిపోతుంది.
నీరంతా సముద్రంలోకి చేరితే సముద్ర మట్టాలు విపరీతంగా పెరుగుతాయి. లక్కీగా అక్కడి అతిశీతల ఉష్ణోగ్రతలు కరిగిన నీటిని మళ్లీ గడ్డకట్టేలా చేస్తున్నాయ్. దానివల్ల 75 శాతం నీరు గడ్డ కడితే.. మిగతా 25 శాతం నీటి రూపంలో సముద్రంలో చేరుతోందని అంచనా. ఈ పరిశోధనలో భాగం చైనా శాస్త్రవేత్తలు 207 అగ్నిపర్వతాలను గుర్తించి ఒక మ్యాప్ క్రియేట్ చేశారు. ఆ పర్వతాలు ఉన్న ప్రాంతాలను హయ్యర్ రిస్క్ ఏరియాలుగా గుర్తించారు. ఇకపై ఆ పర్వతాలపై కన్నేసి.. అంటార్కిటికాలో ఏర్పడుతున్న మార్పులపై మరింత డీప్గా నిఘా పెట్టనున్నారు. కాబట్టి.. మనం ఇప్పట్లో వర్రీ కావల్సిన అవసరం లేదు.
Also Read: డెడ్ బాడీలనూ వదలని అమ్మాయిలు.. శవాల కొవ్వును, శరీరాల్లోకి ఎక్కించుకొని..