GHMC: స్వేఛ్చ బ్యూరో: దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పరేషన్ గా ఏర్పడిన జీహెచ్ఎంసీ రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27)కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న బడ్జెట్ పైనే ఆశలు పెట్టుకుంది. కొద్ది సంవత్సరాలుగా అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీకి కొత్త ఆదాయ వనరులు లేకపోవటంతో, అప్పులు, వడ్డీలను చెల్లిస్తూనే పరిపాలన వ్యవహారాలను అభివృద్ది కార్యక్రమాలను కొనసాగిస్తుంది. 2020 కరోనా సమయం నాటికి జీహెచ్ఎంసీకి రూ. 6553 కోట్ల అప్పులుండటంతో జీహెచ్ఎంసీ చేసిన అప్పులకు డైలీ రూ. కోటి 40 లక్షలను అసలు, మిత్తీలుగా చెల్లిస్తుండటంతో ప్రస్తుతం జీహెచ్ఎంసీ అప్పు సుమారు రూ. 4876 కోట్లకు తగ్గింది. మొత్తం అప్పులు తీరేందుకు మరో నాలుగైదు ఏళ్ల సమయం పట్టే అవకాశముండటంతో జీహెచ్ఎంసీ వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) వార్షిక బడ్జెట్ లో సుమారు రూ. 1100 కోట్ల పై చిలుకు కేటాయించింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా ప్రతి ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కు జీహెచ్ఎంసీ రూ. వేల కోట్లలో ప్రతిపాదనలను పంపుతున్నా, సర్కారు సైతం అందులో సగం వరకు కేటాయింపులు జరిపి, అందులో సగం నిధులను కూడా మంజూరు చేయటం లేదు. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కొనసాగుతున్న జీహెచ్ఎంసీలోకి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్ఠణ స్థానిక సంస్థలను విలీనం చేస్తూ గత నవంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ప్రీయాంబుల్ ప్రతిపాదనలను పంపటంతో ఆగ మేఘాలపై అధికారులు పట్టణ స్థానిక సంస్థల విలీనంతో పాటు 2 వేల 53 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పెరిగిన పరిధిని సైతం 30 సర్కిళ్ల నుంచి 60కి, ఆరు జోన్ల నుంచి పన్నెండు జోన్లకు, అలాగే 150 మున్సిపల్ వార్డులను 300 వార్డులుగా పునర్విభజించిన సంగతి తెల్సిందే. త్వరలోనే మూడు కార్పొరేషన్లుగా విభజించాలన్న ప్రతిపాదనపై ఒక వైపు కసరత్తు చేస్తూనే రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27) కు సంబంధించి సర్కారు నుంచి రూ. 9700 కోట్లను ఆశిస్తూ జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.
Also Read: IND VS USA: ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే..300 కొట్టడం పక్కా, బుమ్రా, సంజు దూరం
జీహెచ్ఎంసీ సర్కారుకు గత నాలుగు ఆర్థిక సంవత్సరాలుగా పంపిన ప్రతిపాదనలు, సర్కారు విడుదల చేసిన నిధుల వివరాలిలా ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.3072.11 కోట్ల విలువైన ప్రతిపాదనలు సర్కారుకు పంపగా, సర్కారు కేవలం రూ. 346.55 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరం (2024-25)లో కూడా సర్కారు జీహెచ్ఎంసీ పంపిన ప్రతిపాదనలను పక్కనబెట్టిన సర్కారు కేవలం రూ. 2654 కోట్లను కేటాయించి, ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు రూ.948.31 కోట్లను విడుదల చేసింది. ఆ మరుసటి ఆర్థిక సంవత్సరం (2025-26)లో కూడా జీహెచ్ఎంసీ అవసరాలకు తగిన విధంగా ప్రతిపాదనలను సర్కారుకు పంపగా, అదే హెచ్ సిటీ ప్రాజెక్టు ప్రతిపాదనల కోసం రూ. 2654 కోట్లను కేటాయిచిన సర్కారు ఏడాది చివరి వరకు కేవలం రూ. 584.38 కోట్లు విడుదల చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27) కు సంబంధించి కూడా జీహెచ్ఎంసీ సర్కారుకు రూ. 9700 కోట్ల విలువైన ప్రతిపాదనలను సమర్పించి, అందులో కనీసం రూ. 3900 కోట్ల వరకు విడుదల చేస్తుందన్న అశలు పెట్టుకుంది. కానీ ఈ నెల 26వ తేదీ నుంచి మొదలు కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సర్కారు ఏ మాత్రం నిధులు కేటాయిస్తుంది? అందులో ఎంత వరకు నిధులు విడుదల చేస్తుందో వేచి చూడాలి.
Also Read: Green mirchi: పచ్చిమిరపకాయలు తింటే క్యాన్సర్ రాకుండా ఉంటుందా?