WhatsApp AI Update: వాట్సాప్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు మెటా సంస్థ సిద్ధమైంది. నిత్యం కోట్లాది మంది వాడే ఈ మెసేజింగ్ ప్లాట్ఫారమ్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సామాన్యులకు మరింత చేరువ చేసేలా కీలక మార్పులు చేపట్టింది. ఈ క్రమంలో యాప్ ఇంటర్ఫేస్లో కనిపిస్తున్న మార్పులు టెక్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
గతంలో ఏఐ ఫీచర్లను వాడాలంటే సెర్చ్ బార్ లేదా ప్రత్యేకమైన ఐకాన్ మీద ఆధారపడాల్సి వచ్చేది. కానీ తాజా అప్డేట్తో వాట్సాప్ ఒక అడుగు ముందుకు వేసి, వినియోగదారుల కళ్ల ముందే మెటా ఏఐని ఉంచబోతోంది. దీనివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సంభాషించడం ఒక సాధారణ మెసేజ్ పంపినంత సులభం కానుంది. ఈ మార్పు కేవలం డిజైన్ పరంగానే కాకుండా, యాప్ పనితీరులో కూడా వేగాన్ని పెంచనుంది.
Also Read: జియో, ఎయిర్టెల్కు చుక్కలు చూపిస్తున్న BSNL.. రూ.997 ప్లాన్పై బంపర్ ఆఫర్!
వాట్సాప్ ప్రధాన స్క్రీన్ కింద కనిపించే నావిగేషన్ బార్లో ఒక పెద్ద మార్పు చోటుచేసుకోనుంది. సాధారణంగా మనకు కనిపించే ‘కమ్యూనిటీస్’ ట్యాబ్ స్థానాన్ని ఇకపై నేరుగా ‘మెటా ఏఐ’ ట్యాబ్ భర్తీ చేయనుంది. అంటే.. వినియోగదారులు ఇతర చాట్ల మాదిరిగానే ఏఐని కూడా ఒక ప్రత్యేక విభాగం ద్వారా యాక్సెస్ చేయవచ్చు. తద్వారా పదే పదే వెతుక్కోవాల్సిన అవసరం లేకుండానే కృత్రిమ మేధ సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఈ కొత్త విభాగం ద్వారా వినియోగదారులు కేవలం ప్రశ్నలు అడగడమే కాకుండా, సృజనాత్మక పనులను కూడా చక్కబెట్టుకోవచ్చు. వాయిస్ కమాండ్ల ద్వారా ఏఐకి సూచనలు ఇవ్వడం, కళ్లు చెదిరే యానిమేటెడ్ చిత్రాలను సృష్టించడం వంటివి ఇకపై చిటికెలో జరిగిపోతాయి. సందేహాల నివృత్తి నుంచి వినోదం వరకు అన్ని రకాల ఏఐ అవసరాలను ఈ ఒక్క ట్యాబ్ తీరుస్తుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి రాలేదు. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.6.5ను ఉపయోగిస్తున్న కొద్దిమంది యూజర్లకు మాత్రమే దీనిని పరీక్షిస్తున్నారు. WABetaInfo నివేదిక ప్రకారం.. ఈ ప్రయోగాత్మక దశ విజయవంతం అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లందరికీ ఈ అప్డేట్ క్రమంగా అందుబాటులోకి రానుంది.
Also Read: AIతో వచ్చిన తిప్పలు.. 35% పెరగనున్న ల్యాప్టాప్ ధరలు!