Laptop Prices 2026: బడ్జెట్ ధరలో మంచి ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకిది చేదు వార్తే అవుతుంది. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గమనిస్తుంటే.. రాబోయే కొద్దిరోజుల్లో ల్యాప్టాప్ కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు పరోక్షంగా పర్సనల్ కంప్యూటర్ల ధరలపై పెను ప్రభావం చూపుతున్నాయి.
సాధారణంగా ల్యాప్టాప్ ధరలు ఏటా స్వల్పంగా మారుతుంటాయి. కానీ ఈసారి మెమరీ చిప్స్, గ్రాఫిక్స్ కార్డ్స్ (GPU) వంటి కీలక భాగాల ధరలు ఆకాశాన్ని తాకడమే అసలు సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ టెక్ కంపెనీలు తమ AI డేటా సెంటర్లు, క్లౌడ్ సర్వర్ల కోసం భారీ మొత్తంలో RAM, SSDలను కొనుగోలు చేస్తున్నాయి. ఈ భారీ కంపెనీలు ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధపడటంతో, సాధారణ కన్స్యూమర్ ల్యాప్టాప్లకు అవసరమైన విడిభాగాల లభ్యత తగ్గిపోయి, వాటి రేట్లు మూడు రెట్లు పెరిగాయి.
Also Read: ఇండక్షన్ స్టవ్ వాడుతూ కరెంటు బిల్లును సగానికి తగ్గించుకోవచ్చు.. అదెలాగో తెలుసా?
ఈ సంక్షోభం కారణంగా మార్చి నెలాఖరికి ల్యాప్టాప్ ధరలు 35% నుంచి 40% వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో 10% మేర ధరల పెరుగుదల కనిపిస్తుండగా, రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రం కానుంది. ముఖ్యంగా గేమింగ్ ల్యాప్టాప్లు, గ్రాఫిక్ డిజైనింగ్కు ఉపయోగించే హైఎండ్ మెషీన్ల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరవచ్చు. ఇంటెల్ వంటి కంపెనీల ఎంట్రీ లెవల్ ప్రాసెసర్ల కొరత కూడా బడ్జెట్ ల్యాప్టాప్ల లభ్యతను దెబ్బతీస్తోంది.
భారతదేశంలో పర్సనల్ కంప్యూటర్ అమ్మకాలు ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, ఈ ధరల పెరుగుదల వల్ల భవిష్యత్తులో మార్కెట్ మందగించే ప్రమాదం ఉంది. ఇప్పటికే హెచ్పి, డెల్ వంటి టాప్ బ్రాండ్లు తమ ధరలను సవరించే పనిలో ఉన్నాయి. అందుకే, మీరు కొత్త ల్యాప్టాప్ తీసుకోవాలని భావిస్తుంటే, ధరలు మరింత పెరగకముందే మంచి నిర్ణయం తీసుకోవడం ఆర్థికంగా లాభదాయకం.
Also Read: రూ.40వేల లోపు 4K స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలు.. ఏఐ ఫీచర్లు వేరే లెవల్!