SRH Player: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ (VAIBHAV SURYAVANSHI) అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో 700కు పైగా పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు. అటు క్రిస్ గేల్ లాంటి దిగ్గజాల రికార్డులను కూడా బద్దలు కొట్టాడు వైభవ్. ఈ క్రమంలో ఐపిఎల్ 2026 టోర్నమెంట్ సందర్భంగా దాదాపు 50 లక్షల ప్రైజ్ మనీ కూడా దక్కించుకున్నాడు. దీంతో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ పైన సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే లేటెస్ట్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు లియామ్ లివింగ్ స్టోన్ ( LIAM LIVINGSTON) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను టీవీల్లో అసలు క్రికెట్ చూడబోనని.. కానీ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా టీవీ ఆన్ చేస్తానని వెల్లడించారు. అతడు ఔట్ కాగానే, టీవీ కట్టేస్తానంటూ వ్యాఖ్యానించారు. దీంతో వైభవ్ సూర్య వంశీ పైన లివింగ్ స్టోన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read: Tanveer Ahmed: బాబర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభవ్ కంటే భయంకరంగా ఆడతాడు
ఐపీఎల్ 2026 లో అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ పై 13 కోట్ల సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు లివింగ్ స్టోన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు వైభవ్ లాంటి క్రికెటర్ ను తాను ఎప్పుడూ చూడలేదని ప్రశంసించారు. బ్యాటింగ్ కు దిగిన నుంచి, వికెట్ పోయేవరకు అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తాడని వెల్లడించారు. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా ఎన్ని ప్రణాళికలు వేసిన ఆ బుడ్డోడు ఇరగదీసాడని పేర్కొన్నారు లివింగ్ స్టోన్. వాడికి ఎక్కడి నుంచి అంత పవర్ వస్తున్నాయో తెలియదు కానీ… వైభవ్ బ్యాటింగ్ కు తాను ఫిదా అయిపోయినట్లు వెల్లడించారు.
15 ఏళ్ల వైభవ్ కు బంగారు భవిష్యత్తు ఉందని.. ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి క్రికెటర్ గా మారబోతున్నట్లు జోష్యం చెప్పారు. ప్రస్తుతానికైతే ప్రపంచంలో అత్యంత ప్రమాదమైన టి20 ఆటగాడిగా వైభవ్ ఉన్నాడని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు. అతి త్వరలోనే లెజెండ్ గా కూడా మారబోతున్నట్లు కామెంట్స్ చేశారు. అతనికి పోటీగా ఎవరు రారని… చరిత్రలో నిలిచిపోయే పీస్ అతడేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే తాను వైభవ్ బ్యాటింగ్ వస్తేనే టీవీ ఆన్ చేసి చూస్తానని వెల్లడించారు. దీంతో లివింగ్ స్టోన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వైభవ్ సూర్య వంశీ పైన ప్రశంసలు కురిపించిన లివింగ్ స్టోన్…. అదే సమయంలో ఐపీఎల్ పరువు కూడా తీశాడు. ఐపీఎల్ టోర్నమెంట్ బోరింగ్ లీగ్ గా మారుతోందని.. కేవలం బ్యాటర్లకు మాత్రమే అనుకూలంగా ఉంటుందని బాంబు పేల్చారు. ఇలాగే టోర్నమెంట్ కొనసాగితే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉండే ఛాన్స్ ఉందని వెల్లడించారు.