Fake Air Force Officer: హైదరాబాద్ సైదాబాద్ పరిధిలో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిగా నటిస్తూ.. నిరుద్యోగ యువతను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎయిర్ ఫోర్స్ యూనిఫాం ధరించి, తనకు ఉన్నతస్థాయి పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేసిన తీరు.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నగరంలో తీవ్ర సంచలనం రేపింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఉద్యోగినని చెబుతూ యువతను మభ్యపెట్టినట్లు తెలిసింది. ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన డ్రెస్ ధరించి, సోషల్ మీడియాలో కూడా అదే విధంగా ఫొటోలు పోస్ట్ చేస్తూ తన గుర్తింపును నిజమని నమ్మేలా చేశాడు. ముఖ్యంగా ఉద్యోగాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగ యువత, మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ముందుగా నమ్మకం పెంచుకోవడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు, మెడికల్ ఖర్చులు, ఫైల్ ప్రాసెసింగ్ ఛార్జీలు అంటూ విడతల వారీగా డబ్బులు వసూలు చేయడం నిందితుడి పద్ధతిగా పోలీసులు గుర్తించారు. మొదట చిన్న మొత్తాలు తీసుకుని, నిదానంగా భారీ మొత్తాలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో పలువురు తమకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతేకాదు.. నిందితుడు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిగా ఉన్నానని చెప్పి మహిళలతో సన్నిహిత సంబంధాలు కూడా పెంచుకున్నట్లు విచారణలో తేలింది. ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుని సెటిల్ అవుతానని చెప్పి కొంతమంది యువతులను కూడా మోసగించినట్లు సమాచారం. తనకున్న పరిచయాలు, అధికారులతో సంబంధాల గురించి గొప్పలు చెప్పడంతో చాలామంది అతడి మాటలు నమ్మినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఇటీవల ఒక బాధితుడు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. ఈ మోసం వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడి కదలికలను గమనించారు. శుక్రవారం అతడని పోలీసులు వల వేసి పట్టుకున్నారు. తన దగ్గర నుంచి ఎయిర్ ఫోర్స్ డ్రెస్, నకిలీ గుర్తింపు కార్డులు, మొబైల్ ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో నిందితుడు చాలా కాలంగా ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు.. పోలీసులకు సమాచారం లభించింది. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా కొందరిని మోసం చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. అతడి కాల్ డేటా, బ్యాంకు లావాదేవీల ఆధారంగా మరిన్ని బాధితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.