Wine Shops: స్వేచ్ఛ బ్యూరో: రాయపర్తి మండల కేంద్రంలోని వైన్స్ షాపుల్లో జరుగుతున్న అక్రమాలపై వరుసగా వార్తలు ప్రచురితమవుతున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైన్స్ షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం సరఫరా జరుగుతోందనే ఆరోపణలు పలుమార్లు వెలుగులోకి వచ్చినా, సంబంధిత అధికారులు మౌనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
స్థానికుల కథనం ప్రకారం రాయపర్తి వైన్స్ షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒక క్వార్టర్ బాటిల్పై రూ.20 నుంచి రూ.30 వరకు, ఫుల్ బాటిల్పై రూ.60 నుంచి రూ.90 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు. రోజూ వందలాది మంది వినియోగదారుల నుంచి ఈ విధంగా అదనపు మొత్తాలు వసూలు చేయడం వల్ల భారీగా అక్రమ లాభాలు పొందుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, రాయపర్తి పరిసర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బెల్ట్ షాపులకు కూడా ఇదే వైన్స్ షాపుల నుంచి మద్యం సరఫరా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బహిరంగంగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నప్పటికీ వాటిపై ఎలాంటి దాడులు, తనిఖీలు నిర్వహించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ప్రజలు చర్చించు కుంటున్నారు. మరోవైపు, బెల్ట్ షాపుల నిర్వాహకులు నిర్భయంగా వ్యాపారం కొనసాగిస్తుండగా, వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also read: Puri Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఓకేసారి 120 మంది భక్తులు..!
వరుసగా వార్తలు వెలువడుతున్నప్పటికీ వర్ధన్నపేట ఎక్సైజ్ శాఖ అధికారులు రాయపర్తి వైన్స్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించకపోవడం, అక్రమాలపై స్పందించకపోవడం వల్ల స్థానికుల్లో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రాయపర్తి వైన్స్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరిగాయా..? బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం సరఫరా చేశారా..? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఆరోపణలపై స్పందించిన వరంగల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణెమ్మ రాయపర్తిలోని వైన్స్ షాపులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామని తెలిపారు. సంబంధిత అధికారులతో తనిఖీలు నిర్వహించి విచారణ చేపడతామని చెప్పారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయించినా, బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం సరఫరా చేసినా అవి రుజువైతే సంబంధిత వైన్స్ షాపు నిర్వాహకులపై చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మణెమ్మ అన్నారు.
Also read: Supreme Court: ఆ ఒక్క కారణంతో స్కూళ్లను అడ్డుకోవద్దు.. తమిళనాడుకు సుప్రీం వార్నింగ్!