ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సలిజం నుంచి పూర్తిస్థాయిలో విముక్తి పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో భద్రతా దళాల కృషి వెలకట్టలేనిదని ఆయన కొనియాడారు. ఈశాన్య ప్రాంతంలో తొలిసారిగా నిర్వహించిన 87వ సీఆర్పీఎఫ్ దినోత్సవ పరేడ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
గతేడాది వేసవిలో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రిగుట్ట కొండల్లో జరిగిన ఆపరేషన్ను మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుమారు 45 డిగ్రీల భానుడి భగభగలు.. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య దళాలు అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించాయని గుర్తుచేశారు. ఏకధాటిగా 21 రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్లో మన జవాన్లు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదని అన్నారు. ఫలితంగా 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. ప్రాణాలకు తెగించి పోరాడిన భద్రతా దళాల సాహసాన్ని యావత్ దేశం గర్విస్తోందని ఆయన ప్రశంసించారు.
ఒకప్పుడు దేశంలోని 12 రాష్ట్రాల్లో అనేక జిల్లాలకు విస్తరించిన నక్సలిజాన్ని అణచివేయడంలో సీఆర్పీఎఫ్ అలాగే కోబ్రా దళాలు వెన్నెముకగా నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దృఢ సంకల్పాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ రెడ్ టెర్రర్ నుంచి దేశాన్ని విముక్తి చేసే దిశగా అడుగులు వేశాయి. కేవలం మూడు సంవత్సరాల స్వల్ప కాలంలోనే ఈ క్లిష్టమైన లక్ష్యాన్ని సాధించడం విశేషమని అమిత్ షా పేర్కొన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో సీఆర్పీఎఫ్ పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
జమ్ము కశ్మీర్లో ఒకప్పుడు పరిస్థితులు దారుణంగా ఉండేదని గుర్తుచేశారు. అదే ఇప్పుడు అలాంటి ఘటనలు మచ్చుకైనా కనిపించడం లేదని చెప్పారు. మణిపూర్లో చోటుచేసుకున్న జాతి హింస సైతం నియంత్రణలోకి వచ్చిందని తెలిపారు. ఉగ్రవాదం అలాగే వేర్పాటువాద శక్తులపై రాజీలేని పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. సరిహద్దులతో పాటు దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో సీఆర్పీఎఫ్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ALSO READ: Harish Rao: పోలీసుల తీరుపై హరీష్ రావు ఆగ్రహం.. అసెంబ్లీలో తేల్చుకుంటామని సంచలన వ్యాఖ్యలు