సంగారెడ్డి సెంట్రల్ జైలు వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో ప్రజా మద్దతు పొందలేక అధికార పార్టీ అక్రమ అరెస్టులకు తెరలేపిందని ఆయన విమర్శించారు. మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కంటే ఒక సీటు ఎక్కువగా గెలిచిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఓటమిని జీర్ణించుకోలేక 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా జైలుకు పంపారని మండిపడ్డారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ అర్ధరాత్రి వేళ 15వ వార్డుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. అక్కడ మైనారిటీ మహిళపై ఎమ్మెల్యే గన్ మెన్ దాడికి పాల్పడటం గర్హనీయమని పేర్కొన్నారు. అన్యాయాన్ని అడ్డుకున్న తమ పార్టీ కార్యకర్తలపై ఎదురు కేసులు పెట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక డిఎస్పీ స్వయంగా ఉండి కాంగ్రెస్ నాయకులతో డబ్బులు పంచే ప్రయత్నం చేశారని హరీష్ రావు ఆరోపించారు. నిబంధనల ప్రకారం కేసులు పెట్టాల్సింది ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులపై అని స్పష్టం చేశారు. ఆరుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు. అధికార పార్టీకి పోలీసులు గుడ్డిగా కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తే భవిష్యత్తులో కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న అధికారులు అనవసరంగా ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచించారు. ఏదైనా కేసు నమోదు చేసే ముందు వాస్తవాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని హితవు పలికారు.
రాష్ట్రంలో ప్రతి పరిణామాన్ని బీఆర్ఎస్ గమనిస్తోందని.. ప్రతి అంశాన్ని డైరీలో నోట్ చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ అరాచకాలపై అసెంబ్లీలో సీరియస్ చర్చ చేపడతామని వెల్లడించారు. మెదక్ జిల్లాలో గుండాల రాజ్యం నడుస్తోందా లేక ప్రభుత్వ పాలన సాగుతోందా అని నిలదీశారు. డీజీపీ శివధర్ రెడ్డి వ్యవహారం చట్టంపై గౌరవం తగ్గేలా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు పోలీసులను దూషిస్తున్నా వారిపై చర్యలు లేవని.. కానీ బీఆర్ఎస్ నేతలను మాత్రం వేధిస్తున్నారని మండిపడ్డారు. ఖాకీ పుస్తకం కేవలం అధికార పార్టీకి చుట్టంలా మారిందా అని ప్రశ్నించారు.
నాలుగు కార్ల కాన్వాయ్ తో వచ్చిన ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోలేదో పోలీసులు చెప్పాలన్నారు. ఎమ్మెల్యే కారు తన కాలిపై నుండి వెళ్లినట్లు బీఆర్ఎస్ కార్యకర్త ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్త ఆటోను తగులబెట్టినట్లు సాక్ష్యాలు ఉన్నా నిందితులను అరెస్టు చేయడం లేదన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. క్యాతన్ పల్లిలో సుమన్ మీద.. ఆమన్ గల్ లో కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మొన్న ఒక జర్నలిస్టుపై కూడా అట్రాసిటీ కేసు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. అన్యాయంగా జైల్లో ఉన్న కార్యకర్తలకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.