Bandi Sanjay: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్లపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిరిసిల్లలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
“కేసీఆర్ ఉన్నారని తెలియాలంటే ఆయన నెలకు ఒకసారి ఫామ్ హౌస్ నుండి యశోద హాస్పిటల్కు వెళ్లాలి. లేదంటే ఎన్నికల ముందు వచ్చి ‘నేను ఉన్నా’ అని చెప్పుకోవాలని కేసీఆర్ ఆరోగ్యంపై సెటైర్లు వేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటామని, ఎవరికీ నష్టం కోరుకునే పార్టీ బీజేపీ కాదని, కానీ ఆయన రాజకీయ ఉనికి ప్రశ్నార్థకమైందని విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేని బీఆర్ఎస్, ఇప్పుడు 100 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదమన్నారు. “చెల్లెలు (కవిత) ఒకవైపు, అల్లుడు (హరీష్ రావు) ఒకవైపు, కొడుకు (కేటీఆర్) ఒకవైపు.. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అసలు ఆ పార్టీ ఉంటుందో లేదో వారికే గ్యారెంటీ లేదు.” అని ఎద్దేవా చేశారు.
గతంలో సిరిసిల్లలో వర్షాలు, వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్లో కూర్చున్న కేటీఆర్ రాలేదని, కేంద్ర మంత్రిగా తనే హెలికాప్టర్ ద్వారా వచ్చి ప్రజలను కాపాడానని గుర్తు చేశారు. “నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఆపద వస్తే వచ్చే నాకు ఓటు వేస్తారా? లేక ఏసీ గదుల్లో ఉండేవారికి వేస్తారా?” అని ప్రజలను ప్రశ్నించారు.
రానున్న ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీ (GHMC) మేయర్ పీఠాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. గతంలో కేటీఆర్ ఇలాకాలో బీఆర్ఎస్ కంటే ఇండిపెండెంట్లే ఎక్కువ గెలిచారంటేనే కేసీఆర్ కుటుంబంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
Read Also: తెలంగాణ రైతులకు సంక్రాంతి కానుక.. అకౌంట్లలో బోనస్ డబ్బులు జమ