TG Paddy Bonus: తెలంగాణ రైతులకు పండుగ పూట శుభవార్త చెప్పింది ప్రభుత్వం. సన్న ధాన్యం బోనస్ రూ.500 డబ్బులను ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిధులను విడుదల చేసింది. పండుగ పూట రైతుల ఖాతాల్లో బోనస్ సొమ్ము పడుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సన్నరకం ధాన్యం పండించిన రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం తాజాగా రూ. 500 కోట్ల బోనస్ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఖరీఫ్ సీజన్లో సన్న ధాన్యం పండించి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు క్వింటాకు రూ. 500 అదనంగా చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ నిధులను విడుదల చేసింది. ఈ సీజన్లో ఇప్పటికే సన్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మొత్తం రూ.1,429 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మద్దతు ధరతో పాటు బోనస్ డబ్బులు ఖాతాల్లో పడుతుండడంతో రైతులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సన్న రకం ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్న ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను అధికారులు నమోదు చేశారు. దీంతో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే బోనస్ డబ్బులు జమ చేస్తున్నారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రభుత్వానికే ధాన్యం విక్రయించేలా పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగుతోంది. పండుగ సమయంలో చేతికి డబ్బు రావడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి.
Also Read: ‘సీడ్ బాంబు’ కథనాలకు కదిలిన యంత్రాంగం.. రైతు కమిషన్ ముందుకు రైతులు
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం రకాలకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ధాన్యంలో తేమ శాతం, గింజ నాణ్యతను బట్టి బోనస్ డబ్బులు ఖరారు చేస్తారు. గత కొంతకాలంగా బోనస్ చెల్లింపుల్లో ఆలస్యం అవుతుండడంతో.. రైతులకు తాజా నిర్ణయం భారీ ఊరటనిచ్చింది.