Bhatti Vikramarka: న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రాల ‘విజన్-2047’ ఆర్థిక లక్ష్యాల సమీక్షా సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. 2047 నాటికి దేశంలోని విభిన్న రాష్ట్రాల ఆర్థిక ప్రణాళికలు, వృద్ధి వ్యూహాలు ఏ విధంగా ఉండాలనే అంశంపై ఈ వర్క్షాప్లో సుదీర్ఘంగా చర్చించారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ
ఈ సందర్భంగా తెలంగాణ ప్రతిష్టాత్మక ఆర్థిక లక్ష్యాలను కేంద్రం దృష్టికి భట్టి తీసుకెళ్లారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఇప్పటికే 2025 డిసెంబర్ 9న నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర విజన్, రాబోయే రోజుల్లో చేపట్టబోయే వ్యూహాత్మక ప్రణాళికలను అధికారికంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడంపై కేంద్ర అధికారులతో చర్చించారు. వర్క్షాప్ ముగిసిన అనంతరం పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తానని తెలిపారు.
హరీష్ రావు విమర్శలపై భట్టి తీవ్ర ఆగ్రహం
మరొకవైపు, రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన భూముల అంశంపై భట్టి విక్రమార్క స్పందించారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పూర్తి వివరాలను వెల్లడించారని, దానికి సంబంధించిన అన్ని కీలక పత్రాలను శాసనసభకు సమర్పించినట్లు చెప్పారు. బిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే, ప్రతిపక్షాలు అనవసర వివాదాలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.
Also Read: అసెంబ్లీలో బీఆర్ఎస్ నల్ల టీషర్టుల డ్రామా.. అసలు వ్యూహం బయటపెట్టిన మంత్రి!