రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మార్మోగిపోతోంది. మున్సిపల్ ఎన్నికల్లో టైం, డేట్ చెప్పి మరీ ప్రతిపక్షాలను దెబ్బకొట్టారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో సుమారు 100కు పైగా మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు కైవసం చేసుకుంటామని ముందే ప్రకటించారు. అయితే, దాదాపు సీఎం రేవంత్ టార్గెట్ రీచ్ అయినట్టు ఫలితాలను చూస్తే అర్థం అవుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 92 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. అనగా 86 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు.. కొత్తగూడెం కార్పొరేషన్ను (కాంగ్రెస్ + సీపీఐ), నిజామాబాద్ కార్పొరేషన్ (ఎంఐఎం+ కాంగ్రెస్) షేర్ చేసుకున్నాయి. మిగతా నాలుగు కార్పొరేషన్లలో కాంగ్రెస్ సింగిల్గా పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది.
సీఎం రేవంత్ దెబ్బకు ప్రతిపక్షాలకు నిజంగానే మైండ్ బ్లాక్ అయినట్టు తెలుస్తోంది.బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ఎన్నికల్లో సీఎం రేవంత్ ప్రచారం చేశారు. ఆ రెండు పార్టీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్టే అని.. తను మున్సిపల్ మంత్రిగా ఉన్నానని.. మన వాళ్లకు ఓటు వేస్తే నిధులు ఇచ్చే బాధ్యత తనదని.. అభివృద్ధికి ఎలాంటి లోటు ఉండదని రేవంత్ ప్రచారం చేశారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించడంలో సీఎం సక్సెస్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా, కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడంలేదని, కాళేశ్వరం అవినీతి ఆధారాలు కేంద్రం వద్ద ఉన్నా బీఆర్ఎస్ మీద చర్యలు తీసుకోవడం లేదని.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని నమ్మించగలిగారు. ఫలితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఆ రెండు పార్టీలను దూరంగా పెట్టినట్టు చర్చ జరుగుతున్నది.
సీఎం రేవంత్ ఎన్నికల సమయంలో రైతులకు వాగ్దానం చేశారు. మున్సిపోల్స్ ఫలితాలు రాగానే.. బోనస్ ఇస్తానని ప్రకటించారు. చెప్పిన విధంగానే నిన్న రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లకు పైగా సన్న వడ్లకోసం బోనస్ విడుదల చేసింది. ఆ డబ్బులు రైతుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. సీఎం రేవంత్ మాట ఇస్తే నిలబెట్టుకుంటారని.. మరోసారి నిరూపించారని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. అదేవిధంగా రైతు భరోసా కోసం రూ.9 వేల కోట్లు సమకూర్చే పనిలో ఉన్నారని సైతం కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. యాసంగి సీజన్ లో రైతులకు రైతు భరోసా ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
Dayakar Rao: నేను రాజకీయాల్లో ఉండాలా.. వద్దా..? కన్నీరు పెట్టుకున్న దయాకర్ రావు, అసలేం జరిగిందంటే..?
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఇక్కడ వచ్చిన ఫలితాలు చూసి కాంగ్రెస్ జాతీయ అధిష్టానం హర్షం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక ముందు కూడా ఇలాగే పనిచేయాలని జాతీయ నాయకత్వం రేవంత్ రెడ్డికి వెన్నుతట్టి ప్రోత్సహించిదని తెలుస్తోంది. ఇటు ప్రజల నుంచి అటు పార్టీ నుంచి.. అటు హైకమాండ్ వద్ద సైతం సీఎం రేవంత్కు మంచి మార్కులు పడ్డాయి. ఫలితంగా ఇదే జోరుతో రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం మరోసారి జిల్లా ఇన్ చార్జి మంత్రులు ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ సైతం ఉంటుందని.. మంచి పనితీరు కనబరిచిన వారికి పదవులు వస్తాయని ప్రకటించినట్టు ప్రచారం జరుగుతోంది.