CM Revanth Reddy Comments(Political news today telangana): తెలంగాణతో మాజీ సీఎం కేసీఆర్ కు పేరు బంధం లేదు.. పేగు బంధం లేదు.. అది ఎప్పుడో తెగిపోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఓ పద్ధతి పాడు లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
‘ఇటు అధికారం పోయింది.. ఆ తరువాత ఆరోగ్యం బాగాలేదు.. అటుపైగా కూతురు జైలులో ఉంది.. కాబట్టి ఆయనకు ప్రస్తుతం మానసిక పరిస్థితి బాగాలేదు.. అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు.. ఆయనను పట్టించుకోవొద్దు.. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ కు ఎలాంటి పాత్ర లేదు. టీఆర్ఎస్ పార్టీ పేరులో తెలంగాణ పదాన్ని తొలగించినప్పుడే తెలంగాణ సమాజానికి ఆయన దూరమైపోయారు. ప్రస్తుతం తెలంగాణతో ఆయనకు పేరు బంధం లేదు.. పేగు బంధం లేదు’ అని ఆయన అన్నారు.
కేటీఆర్ విషయమై మాట్లాడుతూ.. తాను కేటీఆర్ లాగా తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలేదని.. అసలు కేటీఆర్ గురించి మాట్లాడడం టైం వేస్ట్ అంటూ ఆయన పేర్కొన్నారు. అధికారం కోల్పోయారు కాబట్టి వారు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడంలేదన్నారు. ఎన్నికల ప్రచార సభలలో అనవసర వ్యాఖ్యలు చేస్తూ వాళ్లంతట వాళ్లే విలువను దిగజార్చుకుంటున్నారని ఆయన అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు.. ఇప్పుడు ఓడిపోయే సరికి ఎందుకు ఆగమాగమైతున్నారు..? ఓటమిలో కూడా పాఠం నేర్చుకోవాలని కేటీఆర్ కు ఆయన సూచన చేశారు.
Also Read: ‘మోదీ గ్యారంటీకి వారంటీ ముగిసింది.. రాహుల్ గాంధీనే ప్రధాని’
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని, తెలంగాణలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్చే 100 ఏళ్లకు ఏం చేయాలో అనేదానిపైన ఇప్పటి నుంచే తాము ఆలోచనలు చేస్తున్నామని.. ఆ మాదిరిగానే అభివృద్ధి ఉంటుందని చెప్పారు. పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఆయన అన్నారు.