హైదరాబాద్ మహానగరాన్ని పూర్తిస్థాయిలో పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం కోర్ అర్బన్ రీజియన్ (CUR) పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్ల ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. నగర జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే పారిశుధ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు రావాలని సీఎం అభిప్రాయపడ్డారు.
నగరంలో ప్రతిరోజూ వంద శాతం ఇంటింటి చెత్త సేకరణ జరగాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చెత్త సేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని హెచ్చరించారు. పారిశుధ్య పనుల కోసం పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు. ఒక్కో వాహనానికి నిర్దిష్ట ఏరియాను కేటాయించి పర్యవేక్షించడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. చెత్త సేకరణ వ్యవస్థ నిరంతరం నిఘాలో ఉండాలని అధికారులకు తెలిపారు.
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డులపై ఒత్తిడి పెరుగుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే గతంలో గుర్తించిన కొత్త డంపింగ్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్పొరేషన్ల వారీగా సమీపంలోని డంపింగ్ యార్డులకు చెత్తను వేగంగా తరలించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుందని సీఎం వివరించారు.
నగరంలో నిర్మాణ వ్యర్థాల (C&D Waste) నిర్వహణపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్ల పక్కన ఖాళీ ప్రదేశాల్లో నిర్మాణ వ్యర్థాలను పడేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రై మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. నగరం ఎక్కడా అపరిశుభ్రంగా కనిపించకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను కోరారు.
వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున దోమల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నగరవాసులకు మెరుగైన వైద్యం నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సహా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మరికొందరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.