రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల జోరు కొనసాగుతోంది. పలు సెంటర్ల వద్ద కౌంటింగ్ ఇంకా కొనతసాగుతోంది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఊహించిన విధంగానే ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 60కు పైగా మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటగా.. 15కు పైగా మున్సిపాలిటీల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ చతికిల పడింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. సుమారు 30కు పైగా స్థానాల్లో హంగ్ ఏర్పడినట్టు తెలుస్తున్నది. చాలా స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు దాదాపు ఒకేలా ఫలితాలు వచ్చినట్టు తెలుస్తున్నది.దీనికి తోడు చాలా స్థానాల్లో స్వతంత్రులు గెలిచినట్టు సమాచారం.
రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లలో నిజామాబాద్, కరీంనగర్ మినహా మిగతా రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, రంగారెడ్డి కార్పొరేషన్లలో కాంగ్రెస్ సత్తా చాటినట్టు సమాచారం. ఇక కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సైతం హంగ్ చాయలు కనిపిస్తుండగా.. స్వతంత్రులతో కలిసి మేయర్ పీఠం అధిరోహించాలని కాషాయపార్టీ ఎదురుచూస్తున్నది. అయితే, కార్పొరేషన్లలో ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్నట్టు సమాచారం.మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ ఎన్నికలు తమమై మరింత బాధ్యతను పెంచాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 30కు పైగా స్థానాల్లో హంగ్ ఏర్పడగా.. ఆ మున్సిపాలిటీలను దక్కించుకోవాలని అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలు ఎదురుచూస్తున్నాయి.ఎలాగైనా వారిని తమవైపునకు తిప్పుకోవాలని ఇరుపార్టీలు ప్రయత్నిస్తుండగా.. గెలిచిన అభ్యర్థులను ఆయా పార్టీలు క్యాంపులకు తరలిస్తున్నట్టు సమాచారం. ఇదిలాఉండగా, తమ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇక ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులు, స్వతంత్రులకు పంట పండిందని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే వారు ఏ పార్టీకి అయితే సపోర్టు చేస్తారో అక్కడ నుంచి పదవులు ఆశించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
Kankanala Ellavva: అదృష్టం అంటే ఆమెదే! రీకౌంటింగ్లోనూ సమానంగా ఓట్లు.. చివరికి..
మొత్తంగా చూసుకుంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ జోరు చూపించగా.. కారు బేజారు అయ్యింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటుతామని గులాబీ నేతలు భావించగా.. వారికి మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది. సీఎం రేవంత్ చెప్పినట్టుగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటగా.. కేటీఆర్, హరీశ్ రావులు విసిరిన సవాళ్లు ఎందుకు పనికిరాకుండా పోయాయని ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్నది. అధికార పార్టీకే మద్దతు ఇవ్వాలని చాలా మంది స్వతంత్రులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాత్రి వరకూ కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుండగా.. నేటి అర్ధరాత్రి వరకూ తుదిఫలితాలు తేలే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదిలాఉండగా, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటగా.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.