Congress Victory: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాంధీ భవన్లో మీడియా వేదికగా స్పందించారు.
అఖండ విజయం – భట్టి విక్రమార్క విశ్లేషణ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాలలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. దాదాపు 83 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించిందని.. మొత్తం మీద 93 స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తున్నామని తెలిపారు. కేవలం మున్సిపాలిటీలే కాకుండా.. ఐదు కార్పొరేషన్లను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మలేదని.. అభివృద్ధికి ,విశ్వసనీయతకే పట్టం కట్టారని భట్టి పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన వారు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని.. ఈ గెలుపు తమపై మరింత బాధ్యతను పెంచిందని ఆయన స్పష్టం చేశారు.
విపక్షాల వాదనలకు చెక్ – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 73 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని గణాంకాలతో వివరించారు. అర్బన్ ఓటర్లు కాంగ్రెస్ను ఆదరించడం విశేషమని.. 85 నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరిగితే 65 చోట్ల ప్రజలు తమను దీవించారని తెలిపారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసినా.. సీఎం రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్క నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని ఆయన అన్నారు. ప్రతి ఎన్నికను రెఫరెండంగా అభివర్ణించే ప్రతిపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు.
కొత్తగూడెంలో జరిగింది ఓటమి కాదని అది కేవలం ‘ఫ్రెండ్లీ కాంటెస్ట్’ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. పఠాన్ చెరువు వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని పేర్కొన్నారు. మిత్రపక్షాలను కలుపుకుంటూ.. ఇచ్చిన మాట తప్పకుండా పరిపాలన సాగిస్తామని ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు.
Also Read: కబ్జాకోరుల గుండెల్లో హైడ్రా వణుకు.. 34.12 కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా