రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి ప్రకంపనలు రేపుతోంది. రెండ్రోజుల కిందట తాండూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరో 10 మంది మొయినాబాద్ ఫాంహౌస్లో పార్టీ చేసుకుంటుండగా పట్టుబడిన విషయం తెలిసిందే.వీరిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అందులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి,ఏపీకి చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ మహేశ్ యాదవ్, మరో నలుగురికి సైతం పాటిజివ్ వచ్చినట్టు ఈగల్ పోలీసుల బృందం ప్రకటించింది. దీనికి తోడు పోలీసులు రైడ్స్ చేస్తున్న సమయంలో పైలెట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేశ్ రెడ్డికి చెందిన గన్తో ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి కాల్పులు జరిపినట్టు సైతం పోలీసులు వెల్లడించారు.
మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారం బయటకు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనళలు వచ్చాయి. అటు టీడీపీ ఎంపీ వ్యవహారంపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుండగా.. తెలంగాణలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ వ్యవహారంపై అధికార కాంగ్రెస్ పార్టీ వరుసగా విమర్శలు చేస్తున్నది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలకు కేటీఆర్ స్పందించారు. తాము డ్రగ్స్ టెస్టులకు సిద్ధమేనని, మీరు కూడా చేయించుకోవాలని ప్రతిసవాల్ విసిరినట్టు తెలుస్తున్నది.
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటి రోజున గవర్నర్ బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేయాల్సి ఉంటుంది. అనంతరం ఒక రోజు గ్యాప్ తర్వాత బడ్జెట్ పద్దులను ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఏయే రంగానికి ఎంత కేటాయింపులు చేశారని చదివి వినిపించనున్నారు. ఈనెల 20న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇదిలాఉండగా, ఈలోపు పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తున్నది. అందులో మూసీ, గోదావరి జలాలు, డ్రగ్స్ అంశం కూడా చర్చకు రానుందని తెలుస్తుండగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ సమాధానంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.ఈ బడ్జెట్ సెషన్స్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని భావించిన గులాబీ పార్టీకి.. డ్రగ్స్ తీసుకుంటూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే దొరకడం మింగుడు పడటం లేదని తెలుస్తున్నది.
ఇదిలాఉండగా, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విసిరిన సవాల్ను స్వీకరించిన కేటీఆర్.. డ్రగ్స్ టెస్టు నిజంగానే చేయించుకుంటారా?మరల అసెంబ్లీలో తమకు అవమానం జరిగిందనే కారణం చూపి వాకౌట్ చేసి వెళ్లిపోతారా? లేక ఈ సెషన్స్ మొత్తం బాయ్ కాట్ చేసి డ్రగ్స్ టెస్టు నుంచి తప్పించుకుంటారా? అని చర్చ జరుగుతున్నది.. నిజంగానే కేటీఆర్ టెస్టు చేయించుకుంటే ఇంతకాలం ప్రజలకు ఉన్న అనుమానాలు అన్ని తొలగిపోతాయని టాక్ వినిపిస్తోంది. ఒక వేళ ఫలితం తారుమారు అయితే ఆయన మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడవచ్చనే ప్రచారం సాగుతోంది. కాగా, కేటీఆర్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేది తెలియాల్సి ఉన్నది.