Addanki Dayakar: బీఆర్ఎస్ నాయకుల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు డ్రగ్స్ తీసుకుని అసెంబ్లీలో మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే వారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగాన్ని చిత్తు కాగితం అని విమర్శించిన వారిని ‘సన్యాసులారా’ అని సంబోధిస్తూ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ నేతలు ప్రజా పక్షాన ఉంటారో లేక ఫామ్ హౌస్కే పరిమితం అవుతారో తేల్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ అంటే ‘బోగస్ రాష్ట్ర సమితి’ అని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనే ప్రతిపక్ష నాయకుడే లేరని ఆయన ఎద్దేవా చేశారు. అసలు తమ పార్టీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో కేటీఆర్, హరీష్ రావు ముందుగా తేల్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఆరు గ్యారెంటీ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుంటే.. దానిని ‘420’ అని క్రియేట్ చేసిన అసలైన 420 గాడు ఎవరో కేసీఆర్, కేటీఆర్ లేదా హరీష్ రావులలో ఎవరో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పదేళ్ల పాలనను చూసి విసిగిపోయిందని.. అందుకే వారిని అధికారం నుంచి దూరం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకుని నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలని అద్దంకి దయాకర్ హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Also: BRS : బీఆర్ఎస్కు షాకివ్వనున్న మాజీ మంత్రి?