Telangana News: తెలంగాణ రాజకీయ పార్టీలకు అసలు టెన్షన్ మొదలైందా? ఈసీ జ్ఞానేశ్కుమార్ ప్రకటన గుబులు రేపుతోందా? అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్లో టెన్షన్ మొదలైందా? ఓట్ల తొలగింపు ఏ పార్టీపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రధాన పార్టీలను వెంటాడుతోంది.
తెలంగాణలో ఓట్ల జాబితా క్లీనింగ్ మొదలు
దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణపై దృష్టి పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ చేపట్టింది. కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ ప్రక్రియ తెలంగాణలో ఉంటుందని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఆయన, ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
ఆదివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో బీఎల్వోలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, పండుగలకు ఇంటిని ఎలా క్లీనింగ్ చేస్తామో, ఐదేళ్లు ఒకసారి వచ్చే ఓట్ల పండగపై ఎన్నికల సంఘం దృష్టి సారించింద న్నారు. బీహార్లో విజయవంతంగా ఎస్ఐఆర్ పూర్తి చేసినట్టు తెలిపారు.
రాజకీయ పార్టీల్లో అప్పుడే టెన్షన్
సుమారు 7.5 కోట్ల మంది ఓటర్లు తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చెప్పారు. దీనిపై ఒక్క ఫిర్యాదు రాలేదన్నారు. రీపోలింగ్, రీకౌంటింగ్ అవసరం లేకపోకుండా పోయిందన్నారు. బెంగాల్, తమిళనాడులో లక్షల్లో ఓట్లను తొలగించింది ఎన్నికల సంఘం. దీనిపై అక్కడి అధికార-విపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం అవేమీ పట్టించుకోలేదు. ఆ ప్రక్రియను ప్రామాణికంగా తీసుకుని తెలంగాణలో నిర్వహించాలని సూచించారు. మూడో విడత ఎస్ఐఆర్ ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పలేదు. మూడు నెలల తర్వాత మొదలు కావచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి.
ఎస్ఐఆర్లో ఓటర్ల జాబితాలో చనిపోయినవారు, డబుల్ ఓట్లు వంటి లోపాలు బయటపడతాయన్నారు. వాటిని సరిచేయడానికి ఎస్ఐఆర్ అవసరమని నొక్కి వక్కానించారు. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో మిగతా రాష్ట్రాల్లో చేపడతామని చెప్పకనే చెప్పేశారు.
ALSO READ: హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన.. తెలంగాణలోని రాజకీయ పార్టీల నేతలకు టెన్షన్ మొదలైంది. ఎస్ఐఆర్ జరిగితే ఓట్ల సంఖ్య తగ్గిపోతుందని భావిస్తున్నాయి పార్టీలు. దీనివల్ల అధికార కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుందని విపక్ష బీఆర్ఎస్ ఆలోచనగా తెలుస్తోంది. ఎస్ఐఆర్ తర్వాత ఎన్నికలు జరిగిన ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలు మళ్లీ విజయం సాధించాయని అంటున్నారు.
అదే జరిగితే కారు పార్టీకి కష్టాలు తప్పవనే వాదన అప్పుడే ఆ పార్టీలోని కొందరు నేతల్లో మొదలైంది. దీనిపై అధికార ప్రభుత్వం నోరు మెదపలేదు. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఈ లెక్కన తెలంగాణలో 30 నుంచి 40 లక్షల వరకు ఓట్లు తొలగించే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. మొత్తానికి ఓట్ల తొలగింపు వ్యవహారం ప్రధాన రాజకీయ పార్టీలకు మింగుడుపడడం లేదు.