Fake news on Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి.. సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలు పూర్తిగా అసత్యమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి అనారోగ్యంతో ఉన్నారన్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని, ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో కావాలనే.. ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ప్రభుత్వ వర్గాల ప్రకారం రేవంత్ రెడ్డి ఎటువంటి అనారోగ్య సమస్యతోనూ బాధపడటం లేదు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ప్రతిరోజూ ప్రభుత్వ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటూ, మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ సాధారణ షెడ్యూల్ ప్రకారమే సీఎం విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
అయితే ఇటీవల ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా వేదికలలో కొందరు కావాలనే ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి.. అసత్య వార్తలను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సీఎం అనారోగ్యానికి గురయ్యారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెబుతూ ఫేక్ పోస్టులు వైరల్ చేశారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం ఖండించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎలాంటి వైద్య చికిత్సలు తీసుకోవడం లేదని, ఆయన ఎక్కడా ఆసుపత్రిలో చేరలేదని అధికారులు స్పష్టంగా తెలిపారు. ఈ తప్పుడు ప్రచారాల వెనుక రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా ఖాతాలు ఈ విధమైన ఫేక్ న్యూస్ను సృష్టిస్తున్నాయని తెలిపారు.
ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని హెచ్చరించింది. ఫేస్బుక్లో దురుద్దేశపూర్వకంగా ఫేక్ పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సైబర్ క్రైం విభాగం ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించిందని, ఫేక్ పోస్టులు చేసిన ఖాతాల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
Also Read: మంత్రులతో సీఎం కీలక భేటీ.. చర్చించే అంశాలివే..
ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం ఒక విజ్ఞప్తి కూడా చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మవద్దని, ముఖ్యంగా అధికారిక నిర్ధారణ లేని ఆరోపణలను షేర్ చేయకుండా జాగ్రత్త వహించాలని కోరింది. ఇలాంటి తప్పుడు వార్తలను ఫార్వర్డ్ చేయడం కూడా నేరమేనని గుర్తుచేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి సోషల్ మీడియా లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ వార్త పూర్తిగా అసత్యం, నిరాధారమైనది, దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేశారు.
రేవంత్ రెడ్డి ఎటువంటి అనారోగ్య సమస్య తోను బాధపడటం లేదు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు, సమర్ధవంతంగా… pic.twitter.com/bM9w57iLGv
— FactCheck_Telangana (@FactCheck_TG) December 22, 2025