CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర పాలనకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరగనుంది. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, రాబోయే నిర్ణయాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
ముఖ్యంగా వచ్చే నెలలో నిర్వహించనున్న శాసనసభ శీతాకాల సమావేశాలపై.. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్షించనున్నారు. సమావేశాల సమయంలో ప్రభుత్వ పనితీరును ప్రజల ముందు స్పష్టంగా ఉంచేలా ప్రణాళిక రూపొందించనున్నారు.
ఇక ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై ..కూడా సీఎం ప్రత్యేకంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న అంశంపై మంత్రుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.
భవిష్యత్తులో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా.. ఈ సమావేశంలో కీలక చర్చ జరగనుంది. మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహకాలు, ఎన్నికల షెడ్యూల్, పార్టీ వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికలో అనుసరించాల్సిన విధానాలపై మంత్రులతో సీఎం ఆలోచనలు పంచుకోనున్నారు.
ఇక పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా.. ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ప్రాజెక్టు అమలు, ప్రస్తుత పరిస్థితి, నిధుల వినియోగం, భవిష్యత్తు ప్రణాళికలపై ప్రభుత్వం తీసుకోవాల్సిన స్పష్టమైన వైఖరిని సీఎం మంత్రులతో కలిసి నిర్ణయించనున్నారని తెలుస్తోంది. కేసీఆర్ చేసిన విమర్శలకు ప్రభుత్వంగా ఎలా స్పందించాలన్న దానిపై వ్యూహాత్మకంగా చర్చించనున్నారు.
అదే సమయంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి కలిగే ప్రయోజనాలు, రైతులకు అందుతున్న నీటి లాభాలు, సాగునీటి విస్తరణ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంపై కూడా ఆలోచన జరుగనుంది.
Also Read: హైదరాబాద్లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రుల పనితీరు వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మంత్రుల శాఖల పనితీరుపై సీఎం సమీక్షించి అవసరమైన సూచనలు, మార్పులు చేయనున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.