Hyderabad: కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను గవర్నర్కు పంపారు. వెంటనే ఆమెని మంత్రి వర్గం నుంచి తొలగించాలని అందులో పేర్కొన్నారు.
పార్టీ కొండా సురేఖ ఎపిసోడ్కు కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్స్టాప్ పెట్టింది. ఆమెని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని రేవంత్ సర్కార్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సురేఖ, చిన్నారెడ్డిలపై వేటుతో నాటకీయ పరిణామాలకు తెరదించింది కాంగ్రెస్ హైకమాండ్. గురువారం మధ్యాహ్నం తర్వాత గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లాకు సీఎం రేవంత్రెడ్డి సిఫార్సు చేశారు. ఈ మేరకు లేఖను ఆయనకు పంపారు. వెంటనే ఆమెని మంత్రివర్గం నుంచి తొలగించాలని అందులో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి లేఖపై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు.
సీఎంవో నుంచి వచ్చిన లేఖను రాజ్భవన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక సమాచారం వెలువడనుంది. ఢిల్లీ నుంచి అందుతున్న తాజా సమాచారం మేరకు.. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కొండా సురేఖ కలిసినప్పుడు రాజీనామా చేయాలని తేల్చిచెప్పారట. గురువారం సాయంత్రంలోగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పినా, ఆమె నుంచి ఎలాంటి సంకేతాలు కనిపించలేదు. గతరాత్రి ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు కొండా సురేఖ వచ్చారు.
ఈ విషయంలో ఆమె గవర్నర్ను సంప్రదించిన సందర్బం లేదు. పరిస్థితి గమనించిన కాంగ్రెస్ హైకమాండ్.. ముఖ్యమంత్రి రేవంత్కు సంకేతాలు ఇచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో కొండా సురేఖ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు తాను వెళ్తే.. ఏదో తప్పు చేసినట్టు అవుతుందని, అదే పార్టీ తొలగిస్తే, తనకు అస్త్రంగా మారుతుందని భావించినట్టు చెబుతున్నారు. వాస్తవానికి కొండా మద్దతుదారుల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. పార్టీ నిర్ణయం తర్వాత మీడియా ముందుకు రావాలని కొండాదంపతులు డిసైడ్ అయినట్టు సమాచారం. గవర్నర్ నుంచి ప్రకటన రాగానే మీడియా ముందుకు రానున్నారట.
మరోవైపు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. చిన్నారెడ్డి స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించింది ప్రభుత్వం. మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్పర్సన్గా సుధారాణి నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.