Feel The Jail: సినిమాల్లో హీరోలు జైలుకు వెళ్లినప్పుడు అక్కడ ఖైదీల జీవితం ఎలా ఉంటుందో చూపిస్తుంటే.. “నిజంగా జైలు లోపల వాతావరణం అలానే ఉంటుందా?” అనే కుతూహలం చాలా మందిలో కలుగుతుంది. తప్పు చేయకుండా జైలుకు వెళ్లడం అసాధ్యం. కానీ, ఎలాంటి తప్పు చేయకుండానే, కేవలం చట్టబద్ధంగా జైలు జీవితాన్ని అనుభవించే సరికొత్త అవకాశాన్ని కల్పిస్తోంది తెలంగాణ జైళ్ల శాఖ. హైదరాబాద్లోని చంచల్గూడ సెంట్రల్ జైలు వేదికగా ‘ఫీల్ ద జైల్’ పేరిట ఈ వినూత్న కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రీ-లాంచ్ చేశారు.
Read also-ఇరిగేషన్ శాఖలో బదిలీల కలకలం.. ఆ రెండు విభాగాలనే ఎందుకు టార్గెట్..?
రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్, పర్యాటకులను, సాహస ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణ ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన పెంచడం, నేరాలకు దూరంగా ఉండేలా క్రమశిక్షణను అలవర్చడమే ఈ వినూత్న ఆలోచన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి హెరిటేజ్ జైలులో రూ.500 కే ఈ సదుపాయం ఉండేది. అయితే ఆ పాత భవనం దెబ్బతినడంతో, ఇప్పుడు హైదరాబాద్ చంచల్గూడలోని ‘స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్’ (SICA) ప్రాంగణంలో మరింత అత్యాధునికంగా దీనిని పునఃప్రారంభించారు. ఇందుకోసం రెండు ప్యాకేజీలను అందుబాటులో ఉంచారు. 24 గంటల ప్యాకేజీ: రూ.2,000 ( ఒక రోజు పూర్తి జైలు అనుభవం). 12 గంటల ప్యాకేజీ రూ.1,000 (సగం రోజు జైలు అనుభవం)
ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, ఇక్కడికి వెళ్లే వారికి ఎలాంటి విలాసాలు ఉండవు. నిజమైన ఖైదీలు ఎలాంటి జీవితాన్ని గడుపుతారో.. ఇక్కడికి వచ్చేవారు కూడా అలాగే బతకాల్సి ఉంటుంది. లోపలికి వెళ్లగానే సాధారణ దుస్తులు తీసేసి, ఖైదీలు వేసుకునే ఖద్దరు యూనిఫాం ధరించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా కేటాయించిన బ్యారక్లు లేదా జైలు గదుల్లోనే సమయం గడపాలి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు లేదా బయటి ప్రపంచంతో కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అవుతుంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు జైలు అధికారులు విధించే కఠినమైన క్రమశిక్షణను, దినచర్యను పాటించాలి.
Read also-ఇస్రో బాహుబలి మళ్ళీ వస్తోంది.. నింగిలోకి GSLV-F17.. ఈసారి గురి తప్పేదే లే!
ఖైదీలకు రోజువారీగా ఇచ్చే మెనూ ప్రకారమే (ఉప్మా, చపాతీ, అన్నం, పప్పు, రసం) భోజనం వడ్డిస్తారు. ఇష్టమున్న వారు జైలు ఆవరణలో తోటపని లేదా క్లీనింగ్ వంటి పనుల్లో కూడా పాల్గొనవచ్చు. ఒకవేళ జైలులోని ఒంటరితనాన్ని, కఠినమైన వాతావరణాన్ని తట్టుకోలేక ఎవరైనా సమయం ముగియకుండానే మధ్యలోనే బయటకు వచ్చేయాలని అనుకుంటే, వారికి రూ.1,000 జరిమానా విధిస్తారు.
జీవితంలో ఒక విభిన్నమైన, కాస్త థ్రిల్లింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారు తెలంగాణ జైళ్ల శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ ‘ఫీల్ ద జైల్’ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. క్రైమ్ రేట్ను తగ్గించడానికి, సమాజంలో మార్పు తీసుకురావడానికి జైళ్ల శాఖ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం నిజంగా అభినందనీయం.