బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు, మాజీ సీఎం కేసీఆర్లను సిట్ అధికారులు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. త్వరలోనే ఈ కేసులో వారిపై చార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. చార్జిషీట్ విషయంలో సిట్ అధికారులకు పూర్తి స్వేచ్ఛతో పాటు ఆర్డర్స్ ఇచ్చినట్టు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. చార్జిషీట్ అనంతరం బీఆర్ఎస్ కీలక నేతల అరెస్టు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విదేశీ కంపెనీకి హెచ్ఎండీఏ నిధులు రూ.50 కోట్లు బదిలీ చేసిన ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ సైతం ఇన్వాల్వ్ అయ్యింది. ఇప్పటికే ఈ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచగా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ను విచారించి ఆ స్టేట్మెంట్ను రికార్డు చేసింది. అంతేకాకుండా ఆనాడు హెచ్ఎండీఏ కమిషనర్గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ను విచారించిన సిట్.. ఆయన వాంగ్మూలం సైతం రికార్డు చేశారు.అయితే, ఈ కేసు విచారణను మరింత స్పీడప్ చేసేందుకు అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కోసం డీవోపీటీ అనుమతి కోరుతూ సిట్ లేఖ రాసింది. తాజాగా ఐఏఎస్ అధికారుల క్రమశిక్షణ కమిటీ (డీవోపీటీ) నుంచి అనుమతులు వచ్చాయి.దీంతో మరోసారి ఫార్ములా ఈ కార్ రేసు కేసు తెరమీదకు వచ్చింది.
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఆనాడు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ నిధులు రూ.50 కోట్లను ఐఏఎస్ అరవింద్ కుమార్ విదేశీ కంపెనీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. తానే అలా చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు కేటీఆర్ సైతం అంగీకరించారు. ఈ కేసులో సిట్ అధికారులు ఏం చేస్తారు? అరెస్టు చేస్తారా? చేసుకోండని బీరాలకు పోయిన సంగతి అందిరికీ తెలిసిందే. కాగా, అరవింద్ కుమార్ను సిట్ ప్రాసిక్యూషన్కు తీసుకున్నాక ఆయన విచారణలో ఏం సమాధానం చెబుతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఆయన నోరు విప్పితే నాడు మున్సిపల్ మంత్రి ఆదేశాలు ఇచ్చినందున ఆయన అరెస్టు తప్పదా? అని సందేహాలు నెలకొన్నాయి.
సరిగ్గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేదా మరల జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఫార్ములా ఈ కార్ రేసు కేసు హడావుడి ఉంటుందని ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్నది. ఎన్నికలు ఉన్న సమయంలోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని అధికార కాంగ్రెస్ ఇబ్బంది పెడుతోందని.. తద్వారా ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నదని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేశారని.. తాజాగా మరోసారి ఫార్ములా ఈ కార్ రేసు కేసును తెరపైకి తెస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఆ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తున్నారని కారు పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.ఒకవేళ కేటీఆర్ అరెస్టు జరిగితే రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు నెలకొంటాయి..జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అది ఎలా ప్రభావితం చూపుతుందో అన్న చర్చ జరుగుతున్నది.