Swachh Godavari: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో పర్యావరణ పరిరక్షణ , భక్తుల సౌకర్యార్థం ‘స్వచ్ఛ గోదావరి – స్వచ్ఛ ధర్మపురి’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన వెంటనే.. క్షేత్ర పరిధిలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తూ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే.. గత కొద్ది రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంతో గోదావరి తీరానికి భారీగా వ్యర్థాలు, ప్లాస్టిక్, , గుర్రపుడెక్క వచ్చి చేరాయి. ఈ చెత్త పేరుకుపోవడంతో నదీ తీరం దుర్గంధంగా మారి.. స్నానాల ఘాట్ల వద్ద భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన మున్సిపల్ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన చర్యలు చేపట్టింది.
మున్సిపల్ చైర్పర్సన్ సంగి నాగలక్ష్మి నేతృత్వంలో జరిగిన ఈ పారిశుధ్య కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది , స్థానిక స్వచ్ఛంద సంస్థల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లిన పాలకవర్గం స్వయంగా గోదావరి తీరంలోని చెత్తను తొలగించి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
గోదావరి నది కేవలం ఒక జలవనరు మాత్రమే కాదని.. అది కోట్లాది మంది నమ్మకమని అధికారులు పేర్కొన్నారు. నదిని కలుషితం చేయకుండా చూడటం ప్రతి భక్తుని బాధ్యత అని వారు కోరారు. ముఖ్యంగా నదిలోకి ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయవద్దని, పాత బట్టలను నదిలో వదలకూడదని, మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన డస్ట్బిన్లను మాత్రమే వినియోగించాలని సూచించారు.
ధర్మపురి క్షేత్రాన్ని పర్యాటక పరంగా, ఆధ్యాత్మిక పరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా ‘స్వచ్ఛ ధర్మపురి’ కార్యక్రమం ఒక కీలక అడుగు. ఈ నిరంతర పారిశుధ్య ప్రక్రియ ద్వారా రాబోయే రోజుల్లో గోదావరి తీరం మరింత స్వచ్ఛంగా, ఆహ్లాదకరంగా మారుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: సైబర్ నేరగాళ్ల గుండెల్లో గుబులు! 32 టీమ్స్.. ఒక్కటే వేట!