Gold Theft: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల కేటుగాళ్లు సరికొత్త పంథాలో మోసాలకు తెరలేపుతున్నారు. అమాయకత్వమే ఆసరాగా చేసుకుని, ప్రభుత్వ అధికారులమంటూ నమ్మించి నిలువునా ముంచేస్తున్నారు. తాజాగా బీబీనగర్ మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సర్వే పేరుతో ఇంట్లోకి దూరిన దుండగులు.. యజమానుల దృష్టి మళ్లించి క్షణాల వ్యవధిలో మూడు తులాల బంగారాన్ని కాజేసిన తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
సర్వే వెరిఫికేషన్ పేరుతో ఎంట్రీ!
బీబీనగర్ మండల కేంద్రంలోని ఒక నివాసానికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు.. తాము ప్రభుత్వ సర్వే వెరిఫికేషన్ కోసం వచ్చామంటూ పరిచయం చేసుకున్నారు. నిజమైన అధికారులేనని నమ్మిన ఆ దంపతులు వారిని ఇంట్లోకి ఆహ్వానించారు. దుండగులు ఎంతో నమ్మకంగా మాట్లాడుతూ, రకరకాల వివరాలు అడుగుతూ భార్యాభర్తలిద్దరినీ మాటల్లో దించారు. వారి మాటల చాతుర్యానికి ఆ దంపతులు పూర్తిగా నమ్మకం పెంచుకున్నారు.
ఫొటోల వంకతో దృష్టి మళ్లింపు.. మాయం!
వివరాల నమోదు పూర్తయిందని నమ్మించిన సదరు కేటుగాళ్లు.. రికార్డుల కోసం ఒక ఫొటో తీసుకోవాల్సి ఉంటుందని సదరు మహిళకు చెప్పారు. ఫొటో కోసం ఆమెను సిద్ధం చేస్తూ, పొజిషన్ సరిచేస్తున్నట్లు నటిస్తూ తీవ్రంగా దృష్టి మళ్లించారు. ఆ అలికిడిలోనే అత్యంత చాకచక్యంగా ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు మంగళసూత్రంను కంటికి రెప్పపాటులో దొంగిలించారు. నగ చేతికి చిక్కగానే పని పూర్తయిందంటూ క్షణాల్లో అక్కడి నుంచి బైక్పై పరారయ్యారు.
పోలీసులకు ఫిర్యాదు.. దర్యాప్తు షురూ
దుండగులు వెళ్లిన కాసేపటికి గానీ బాధితురాలు తన మెడలో నగ లేదనే విషయాన్ని గమనించలేదు. తీరా చూసేసరికి మంగళసూత్రం మాయమవడంతో ఒక్కసారిగా షాక్కు గురైన దంపతులు గట్టిగా కేకలు వేశారు. అప్పటికే దొంగలు అదృశ్యం కావడంతో, వెంటనే వారు బీబీనగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు స్థానిక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు సర్వేల పేరుతో వస్తే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
Also Read: రూ. 100 కోసం ఇంత నీచమా? ర్యాపిడో రైడర్ను నడిరోడ్డుపై వేధించిన యువతి.. వీడియో వైరల్