Hyderabad: అందరికీ సొంత ఇల్లు ఓ కల.. దానిని సాకారం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమైనదని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు అన్నారు. ఇల్లు కొనేందుకు రుణాలిచ్చే ముందు అన్ని విధాలా సరి చూసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. IOV (ఇనిస్టిట్యూషన్ ఆఫ్ వాల్యూయర్స్) రిజిస్టర్డ్ వాల్యూయర్స్ ఫౌండేషన్, IOV హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో “ట్రాన్స్ఫార్మేటివ్ ఎరాలో వాల్యుయేషన్” అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా శ్రీ రంగనాథ్ గారు పాల్గొని ప్రసంగించారు. గతేడాది జులై 19న హైడ్రా ఏర్పడిందని.. అంతకు ముందు వెలసిన నివాస ప్రాంతాలతో పాటు.. అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న వాటి జోలికి వెళ్లమని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత అక్రమ కట్టడాలు వస్తే వాటిని తొలగిస్తామన్నారు. హైడ్రా అంటే కూల్చవేతలు కాదు.. పర్యావరణ హితమైన నగరాభివృద్ధికి దోహదం చేసే సంస్థగా అందరూ గుర్తిస్తున్నారన్నారు. సుస్థిర వ్యాపారానికి హైడ్రా దోహదం చేస్తోందని అందరూ గ్రహిస్తున్నారు.
మోసాలకు ఆస్కారం లేకుండా..
ఎలాంటి మోసాలకు ఆస్కారం లేకుండా సొంతింటి కలను సాకారం చేయడంలో రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు.. ఆ ఇంటికి రుణాలు ఇచ్చే అర్థిక సంస్థలు కూడా బాధ్యత పడాలని శ్రీ రంగనాథ్గారు సూచించారు. సర్వే నంబరు ఒకటి చూపించి.. వేరే చోట ఇళ్ల నిర్మాణం చేపడుతున్నవారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దీనికి సంబంధిత పేపర్లను పరిశీలించాం అనుకుంటే సరిపోదనీ.. క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సిన బాధ్యత రుణాలు ఇచ్చిన సంస్థలపైన ఉంది. ఆర్థిక సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలకు ఆస్తి విలువలను నిర్ణయించడంలో పారదర్శకత, నమ్మకం, కచ్చితత్వాన్ని నిర్ధారించడంలో వాల్యుయేషన్ నిపుణులు పాత్ర చాలా కీలకమైనది అన్నారు. స్థిరాస్తుల విలువ నిర్ధారించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉపయోగంగా ఉన్నా.. క్షేత్రస్థాయి పరిశీలన కూడా అంతే ముఖ్యమన్నారు.
Also Read: గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని తాగుతున్నారా? తస్మాత్.. జాగ్రత్త
పర్యావరణ హితమైన నగరంగా..
గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించి.. వరద ముప్పు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనేది హైడ్రా లక్ష్యమని హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారు అన్నారు. ఈ క్రమంలోనే చెరువుల, నాలాలు, పార్కులు, రహదారుల ఆక్రమణలను నిరోధించి.. ప్రజల అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడేందుకు హైడ్రా ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఓఆర్ ఆర్ పరిధిలో వెయ్యికి పైగా ఉన్న చెరువుల పునరుద్ధరణ జరిగి.. పార్కులన్నీ పచ్చగా ఉన్నప్పుడు పర్యావరణ సమతుల్యత సాధించగలమన్నారు. ఆ దిశగా హైడ్రా పని చేస్తోందని.. హైడ్రా వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలతో ప్రతి ఒక్కరికి చెరువు, నాలా హద్దులు తెలిసాయని చెప్పారు.
ఇప్పుడు ఇల్లు కొనాలనుకునేవారు చెరువు ఎఫ్టీఎల్ పరిధిని పరిశీలిస్తున్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా, గ్రామ, రెవెన్యూ రికార్డుల ఆధారంగా చెరువుల హద్దులను పూర్తి స్థాయిలో నిర్ధారించి ఆ సమాచారం చిటికెలో తెలిసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఈ ప్రక్రియను నాలుగైదు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. బ్యాంకర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు, వాల్యూయర్స్ సందేహాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు ఈ సందర్భంగా నివృత్తి చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎన్. రఘు గారు, CREDAI జాతీయ అధ్యక్షుడు శ్రీ జి. రామి రెడ్డి గారు , ఐవోవీ జాతీయ ఉపాధ్యక్షులు ఆర్ పటేల్, ఐవోవీ ప్రతినిధులు పి. మధు గారు, కె. చిరంజీవిగారితో పాటు.. వాల్యుయేషన్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.