Graduate MLC Polling Day is a Holiday for Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు రోజుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు లీవ్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 27న ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఈ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు జనగామ, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, ములుగు, ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రైవేట్ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని చట్టంలో లేనందున, ఇందుకు సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు తమ సిబ్బందికి ఓటు వేసేందుకు వీలు కల్పించాలన్నారు. ఇందుకు షిఫ్టులు సర్దుబాటు చేయడం లేదా ఓటు వేసి ఆలస్యంగా వచ్చినా కూడా వారిని విధుల్లోకి అనుమతించాలని ఆయన ఆ ఉత్తర్వుల్లో తెలియజేశారు.
Also Read: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నాడు: మంత్రి జూపల్లి
అయితే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న ఉప ఎన్నిక జరగనున్నది. ఉమ్మడి వరంగల్- నల్లగొండ – ఖమ్మం జిల్లాల్లో ఉన్నటువంటి 4,61,806 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగే ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వైన్ షాపులు, బార్లను 48 గంటలపాటు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మే 25 సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు బంద్ కానున్న విషయం తెలిసిందే.