Maganti Gopinath Family Dispute: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బరిలో నిలిచిన అధికార BRS అభ్యర్థి మాగంటి సునీతకు సొంత కుటుంబం నుంచే ఊహించని షాక్ తగిలింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వారసత్వం, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం (ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్) చుట్టూ ముసలం ముదిరింది. ఈ వివాదం ఇప్పుడు కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా, రెవెన్యూ అధికారుల విచారణకు దారితీయడం, ఉపఎన్నికల సమయంలో ఇది జరగడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
దివంగత మాగంటి గోపినాథ్ చట్టబద్ధమైన వారసులను నిర్ధారించే ఈ పత్రాన్ని మాగంటి సునీత ఇటీవల రెవెన్యూ అధికారుల నుంచి పొందారు. అయితే, ఈ సర్టిఫికెట్పై గోపినాథ్ మొదటి భార్యగా పేర్కొంటున్న మాగంటి మాలని దేవి, ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Telangana Politics: కేసీఆర్పై సీబీఐ కేసు.. సీఎం రేవంత్ డిమాండ్పై స్పందించిన కిషన్ రెడ్డి
తమ పేర్లను చేర్చకుండా, తప్పుడు సమాచారంతో సునీత ఈ ధృవీకరణ పత్రాన్ని పొందారని ఆరోపిస్తూ మాలని దేవి, తారక్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు, ఈ వివాదంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా, ఇరుపక్షాల వాదనలు వినేందుకు శేర్లింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయానికి హాజరు కావాలని అందరికీ నోటీసులు జారీ చేశారు.
దీంతో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విచారణకు ఫిర్యాదుదారులు మాగంటి మాలని దేవి, ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్తో పాటు, మాగంటి గోపినాథ్ తల్లి మహానందకుమారి కూడా హాజరయ్యారు. మరోవైపు, BRS అభ్యర్థి మాగంటి సునీత తరపున ఆమె చిన్న కూతురు దీశిరా, వారి తరపు అడ్వకేట్ విచారణకు హాజరయ్యారు. ఇరుపక్షాల నుంచి ఎమ్మార్వో స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు.
మాగంటి మాలని దేవి మాట్లాడుతూ..
తాము ఆరోజు విచారణ కోసం వచ్చినట్లు తెలిపారు. మాగంటి గోపినాథ్ గారి చట్టబద్ధమైన భార్య తానేనని, వెంట ఉన్నది ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్ అని చెప్పారు. తమ ఉనికిని దాచిపెట్టి, తమ పేర్లు లేకుండా మాగంటి సునీత గారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకున్నారని, ఇది పూర్తిగా అన్యాయం, చట్టవిరుద్ధం అని ఆమె అన్నారు.
ఈ విషయంపై తాము ఆధారాలతో సహా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని, తమ ఫిర్యాదును పరిశీలించిన అధికారులు, అందులో వాస్తవం ఉందని గ్రహించి, గతంలో సునీత గారికి జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను రద్దు చేశారని మాలని దేవి వివరించారు. ఆ సర్టిఫికెట్ రద్దు కావడం వల్లే, ఆ రోజు తమను విచారణకు పిలిచారని పేర్కొన్నారు.
గోపీనాథ్ గారికి, తనకు చట్టప్రకారం ఎప్పుడూ విడాకులు కాలేదని ఆమె స్పష్టం చేశారు. తాను ఆయన మొదటి భార్యగా, తన కుమారుడు చట్టబద్ధమైన వారసుడిగా ఉన్నప్పుడు, తమను కాదని సర్టిఫికెట్ ఎలా ఇస్తారని తాము ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ఇది ఆస్తి వాటాల గురించి కాదని, తమ హక్కుల గురించి, తమ గుర్తింపు గురించి అని అన్నారు.
ఆరోజు విచారణలో, ఎమ్మార్వో గారు ఇరుపక్షాల వాదనలు విన్నారని, తమ దగ్గర ఉన్న ఆధారాలు, డాక్యుమెంట్లు ఏమిటని అడిగారని తెలిపారు. తమ వివాహానికి సంబంధించిన అన్ని ఆధారాలు, తమకు విడాకులు కాలేదన్న దానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని, అవన్నీ సమర్పించడానికి తాము సమయం కోరినట్లు చెప్పారు. అవతలి పక్షం (సునీత) కూడా వారి వద్ద ఏమైనా పత్రాలు ఉంటే సమర్పించాలని ఎమ్మార్వో గారు చెప్పారని అన్నారు.
అందుకే, ఇరుపక్షాలు తమ పూర్తి డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు దాఖలు చేయడానికి విచారణను నవంబర్ 25వ తేదీకి వాయిదా వేశారని మాలని దేవి పేర్కొన్నారు. తమ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయని, తమకు న్యాయం జరుగుతుందన్న పూర్తి నమ్మకం ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.