E-Paper
Advertisement

Harish Rao: రైతు ఉత్సవాలు కాదు.. అవి నిరుత్సాహ మేళాలు.. నర్మెట స‌భ‌లో ప్రభుత్వంపై హరీష్ రావు ధ్వజం

Harish Rao: రైతు ఉత్సవాలు కాదు.. అవి నిరుత్సాహ మేళాలు.. నర్మెట స‌భ‌లో ప్రభుత్వంపై హరీష్ రావు ధ్వజం

Harish Rao: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో జరిగిన ఆయిల్ పామ్ రైతు మేళా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉత్సవాలు నిర్వహించడం ‘నిరుత్సాహ మేళా’లను తలపిస్తోందని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు హరీష్ రావు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. రుణమాఫీ కాలేదు.. రైతు భరోసా అందలేదు.. వడగళ్ల నష్టపరిహారం జాడలేదు.. ఇలాంటి పరిస్థితుల్లో సంబరాలు ఎలా చేసుకుంటారని ఆయన నిలదీశారు. ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్.. యాదవరెడ్డి.. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన మంత్రికి రైతుల సమస్యలను వివరించారు.

ప్రభుత్వం వేదికగా ఎంచుకున్న నర్మెట గ్రామంలోనే రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ గ్రామంలోని 725 మంది రైతులలో సుమారు సగం మందికి ఇప్పటికీ రుణమాఫీ కాలేదని, కేవలం ఈ ఒక్క ఊరిలోనే రూ. 3 కోట్ల బాకీ ఉందని గణాంకాలతో సహా వివరించారు. సిద్దిపేట నియోజకవర్గవ్యాప్తంగా 22,849 మంది రైతులకు దాదాపు రూ. 300 కోట్ల రుణమాఫీ నగదు జమ కావాల్సి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ కోసం రూ. 51 వేల కోట్లు అవసరమని బ్యాంకర్లు చెబితే.. బడ్జెట్‌లో రూ. 31 వేల కోట్లకు కుదించి.. చివరకు రూ. 20 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయడం దారుణమని మండిపడ్డారు. దేవుళ్ల మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు.

రైతు భరోసా చెల్లింపుల్లోనూ ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట నియోజకవర్గంలో మూడు సీజన్లకు కలిపి సుమారు రూ. 170 కోట్ల రైతుబంధు నిధులు బకాయి ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ మొత్తం రూ. 25 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ నెల 22న ఏ సీజన్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు.. వడగళ్ల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించడంలోనూ ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది తమ నియోజకవర్గంలో జరిగిన రూ. 6 కోట్ల నష్టానికి సంబంధించి మంత్రి స్వయంగా పరిశీలించినా పైసా సాయం అందలేదని గుర్తు చేశారు.

పంట బీమా పథకం విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం సరికాదని హరీష్ రావు హితవు పలికారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా ప్రతి ఎకరాకు పటిష్టమైన భీమా పథకాన్ని ఈ యాసంగి నుంచైనా అమలు చేయాలని కోరారు. ఉగాది పండుగ పురస్కరించుకుని రైతుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని.. లేనిపక్షంలో రైతు ఉత్సవాలకు అర్థం ఉండదని స్పష్టం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో రైతులకు న్యాయం జరిగేలా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు.

Read Also: Siddipet Farmer Mela: సిద్దిపేటలో రైతు మేళా.. వరి వద్దు.. ఆయిల్ పామ్ ముద్దు.. మంత్రుల పిలుపు

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×