Heera Group Fraud Case: అధిక లాభాల పేరుతో నమ్మించి మోసం చేసిన హీరా గ్రూపు ఆఫ్ కంపెనీస్ సీఈఓ నౌహీరా షేక్ పై కేసు నమోదు అయింది. నగరంలోని సన్ సిటీ ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మా ఫాతిమా అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళ్తే.. 2016లో హీరా గ్రూప్ ప్రతినిధులు కంపెనీ పెట్టుబడులపై నెలకు భారీ లాభాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. సంస్థ విధానాలు, వనరులు, వ్యాపార వ్యవస్థల గురించి చెబుతూ పెట్టుబడి పెట్టితే ఆర్థికంగా పెద్ద మేలు జరుగుతుందని సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో నమ్మకంతో సల్మా ఫాతిమా హీరా గ్రూప్లో సుమారు రూ.40 లక్షల పెట్టుబడి పెట్టింది.
తన పెట్టుబడిపై కొన్నినెలలు కమీషన్లు వస్తుండటంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కూడా అదే కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. సంస్థ నుంచి లాభాలు వస్తున్నాయన్న నమ్మకంతో మరింత మంది పెట్టుబడిదారులను కూడా చేర్చినట్లు ఫిర్యాదుదారు వెల్లడించారు.
అయితే 2018లో పరిస్థితులు పూర్తిగా మారాయి. కంపెనీ ఏ కారణం చెప్పకుండా నెల నెలా ఇస్తున్న కమీషన్లను నిలిపివేసింది. పెట్టుబడిదారులు సంస్థను సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు.
తమను మోసం చేయడమే కాకుండా పెట్టిన డబ్బును తిరిగి ఇవ్వడానికి కూడా.. సంస్థ ముందుకు రాకపోవడంతో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అని సల్మా ఫాతిమా తెలిపారు. ఈ నేపధ్యంలో పోలీసులు నౌహీరా షేక్పై IPC సెక్షన్ల క్రింద చీటింగ్, మోసం, నిధుల దుర్వినియోగం కేసులను నమోదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కంపెనీ బ్యాంక్ లావాదేవీలు, పెట్టుబడిదారుల ఒప్పందాలు, చెల్లింపుల వివరాలు, గతంలో సంస్థ ఇచ్చిన హామీలపై పోలీసులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే నౌహీరా షేక్ను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
అదే సమయంలో బాధితురాలు ఫిర్యాదు చేసిన అంశాలపై మరిన్ని సాక్ష్యాలు సేకరించేందుకు పోలీస్ బృందాలు కృషి చేస్తున్నాయి. ఇలాంటి ఫిర్యాదులు ఇంకెవరైనా చేస్తారా లేదా అన్న దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది నౌహీరా షేక్పై నమోదైన తొలి కేసు కాదు. గతంలో కూడా ఆమెపై పలు ఆర్థిక మోసం కేసులు నమోదు అయ్యాయి. హీరా గ్రూప్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), సీసీఎస్ పోలీసులు కూడా విచారణలు చేపట్టిన విషయం తెలిసిందే. పెట్టుబడిదారుల డబ్బుతో సంస్థ అక్రమ లావాదేవీలు జరిపిందా? విదేశీ మారక నియమాల ఉల్లంఘన జరిగిందా? అనే అంశాలపై గతంలోనూ విచారణలు జరిగాయి.
Also Read: నర్సంపేటకు సీఎం రేవంత్.. రూ.531 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అనేక రాష్ట్రాల్లోని పెట్టుబడిదారులు కూడా ఆమెపై గతంలో ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. కొన్ని కేసుల్లో ఆమె అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవించిన సందర్భాలూ ఉన్నాయి. పెట్టుబడిదారులు తమ డబ్బు కోసం సంవత్సరాలుగా పోరాడుతుండగా, మరో కొత్త కేసు నమోదు కావడంతో హీరా గ్రూప్ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.