నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భాగ్యనగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, మాదకద్రవ్యాల మహమ్మారిని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమయ్యారు. ‘జీరో డ్రగ్స్’ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే పబ్లు, హోటళ్లు, ఇతర వేదికలపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఉన్నతాధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హెచ్-న్యూ, టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ సహా పలు విభాగాల అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ప్రత్యేక నిఘా బృందాల మోహరింపు
నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని సీపీ స్పష్టం చేశారు. ఇందుకోసం శుక్రవారం నుంచే నగరంలోని పబ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించినట్లు తెలిపారు. కేవలం బహిరంగ వేదికలే కాకుండా, సర్వీస్ అపార్ట్మెంట్లు, ప్రైవేట్ ఫామ్ హౌస్లు, హాస్టళ్లలో జరిగే పార్టీలపైనా నిఘా ఉంటుందని హెచ్చరించారు. డ్రగ్స్ సరఫరా చేసేవారు మరియు గతంలో మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులుగా ఉన్నవారి జాబితాను సిద్ధం చేసి, వారి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
సమయపాలన తప్పనిసరి.. లైసెన్సుల రద్దు హెచ్చరిక
న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు సంబంధించి సీపీ కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. పబ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు కచ్చితంగా రాత్రి 1 గంటకే తమ కార్యకలాపాలను ముగించాలని ఆదేశించారు. ఒకవేళ నిర్దేశించిన సమయం కంటే అదనంగా పార్టీలు నిర్వహించినా లేదా డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు అనుమతి ఇచ్చినా సదరు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారి లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తామని తేల్చిచెప్పారు. నగరానికి కొత్తగా వచ్చే వారి వివరాలను సైతం ఆరా తీస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
నగరంలో ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే మైత్రీవనం, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో పటిష్టమైన చెక్పోస్టులు, బ్యారికేడింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు, ర్యాష్ డ్రైవింగ్పై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అయితే, ఈ తనిఖీల పేరుతో సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, వేడుకలు ప్రశాంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగేలా చూడటమే పోలీసుల ప్రాధాన్యతని సీపీ వివరించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరారు.