Chamala Kiran Kumar Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో తొడలు కొడుతూ బూతులు మాట్లాడతానంటున్న కేటీఆర్కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. “కట్టే.. కొట్టే.. తెచ్చే..” అనే సామెత కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు, కేసీఆర్ కుటుంబానికే (KCR Family) సరిగ్గా వర్తిస్తుందని ఎద్దేవా చేశారు. ఉద్యమకారుడి అవతారం ఎత్తి, పిట్ట కథలు చెప్పి అధికారాన్ని కొట్టేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కేసీఆర్ కుటుంబం మాత్రం సంపద తెచ్చుకుందని ఘాటుగా విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో నాయకులు దండుపాళ్యం ముఠాలా (Dandupalyam Gang) తయారై పార్కులు, నాలాలను కబ్జా చేశారని చామల ఆరోపించారు. అందుకే వానొస్తే ఇళ్లు మునిగి జనం నష్టపోయేవారని, ఇప్పుడు హైడ్రా (HYDRAA) ఆక్రమణలను కూల్చేస్తుంటే నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దేవుడే మేడిగడ్డ పిల్లర్లను కుంగదీసి బీఆర్ఎస్ అవినీతి బాగోతాన్ని బయటపెట్టారని అన్నారు.
కేటీఆర్కు బుద్ధి, జ్ఞానం లేదని మండిపడ్డ చామల.. సీఎం రేవంత్ రెడ్డికి, కేటీఆర్కు ఉన్న తేడాను వివరించారు. “రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ నుంచి మొదలుకొని ఎంపీగా గెలిచి.. తన స్వశక్తితో ‘మెరిట్ కోటా’లో (Merit Quota) సీఎం అయ్యారు. కానీ నువ్వు తండ్రి పేరు చెప్పుకుని ‘మేనేజ్మెంట్ కోటా’లో (Management Quota) వచ్చి నేరుగా మంత్రివి అయ్యావు,” అని చురకలు అంటించారు.
కేటీఆర్ ఒక ఐరన్ లెగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, ఆయన వల్లే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా వచ్చిందని ఎద్దేవా చేశారు. 2023లో రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఇంటికి పంపారని, 2029లోనూ అదే జరుగుతుందని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా పిచ్చి మాటలు మాని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని, దమ్ముంటే కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురావాలని సవాల్ విసిరారు.
Read Also: KTR: మా అయ్య మొగోడు.. మొనగాడు.. రేవంత్కు కేటీఆర్ కౌంటర్