HYDRA Action: పాతబస్తీలోని మైలర్ దేవుపల్లిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. కబ్జాకు గురైన 6500 గజాల క్రీడమైదానాన్ని రక్షించింది. దీని విలువ రూ. 100 కోట్లవరకు ఉంటుందని సమాచారం. HMDA అనుమతి పొందిన లేఔట్లో స్పష్టంగా అది క్రీడామైదానం అని పేర్కొన్నప్పటికి.. కొందరు వ్యక్తులు దానిని ఆక్రమించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా.. అక్రమార్కులకు తగిన బుద్ధి చెప్పి భూమిని కాపాడింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్ దేవుపల్లి విలేజ్ శాస్త్రిపురం కాలనీలో హైడ్రా బుధవారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. 188 ఎకరాల హుడా అనుమతి పొందిన లేఔట్లో క్రీడాస్థలం కోసం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. జీ ప్లస్ 3 అంతస్తుల నిర్మాణ దశలో ఉన్న భవనాలు ఐదింటిని హైడ్రా తొలగించింది. మరో రెండు సింగిల్ రూమ్ నిర్మాణాలను తొలగించింది.
1800ల ప్లాట్లకు పైగా ఉన్న ఈ లేఔట్ ప్రకారం.. 6500 గజాల స్థలాన్ని ప్లే గ్రౌండ్ కోసం కేటాయించారు. క్రీడాస్థలానికి కేటాయించిన స్థలం అని తెలిసి కూడా గత 3 సంవత్సరాలుగా నోటరీ మీద స్థానికంగా ఉన్న కబ్జాదారులు ప్లాట్లుగా అమ్మేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిపై గతంలో GHMC నోటీసులు కూడా ఇచ్చింది. 2024లో డిమోలిషన్ చేస్తామని ఆర్డర్లు కూడా జారీ చేసింది. అయినా పట్టించుకోకుండా అక్కడ నిర్మాణాలు జరిగాయి.
ఇదే విషయమై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు GHMC, రెవెన్యూ అధికారులతో కలసి ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లేఔట్ ప్రకారం క్రీడాస్థలం కోసం కేటాయించిందని నిర్ధారణ చేసుకున్నారు. నిర్మాణాలు చేపట్టవద్దని వెంటనే హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 5 నిర్మాణంలో ఉన్న భవనాలతో పాటు రెండు చిన్న గదులతో నిర్మించిన వాటిని తొలగించింది. ఇంకో రెండు భవనాల్లో ఇప్పటికే నివాసాలు ఉండడంతో వాటిని మినహాయించింది. క్రీడామైదానం అందుబాటులోకి రావడంతో శాస్త్రిపురం కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: LPG Gas Saving Tips: వంట గ్యాస్ ఆదా చేయడంలో కుక్కర్ కింగ్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
హైడ్రాకు ఫిర్యాదు చేయగానే చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఆక్రమణలు అడ్డుకుంటే భయపెట్టారని.. హైడ్రా రావడంతో క్రీడాస్థలం కాపాడుకోగలిగామని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ కబ్జా చేసిన వాళ్లు సామాన్యులు కాదని.. అడ్డుకున్నవాళ్లను బెదిరించారని తెలిపారు. మెుత్తం మీద తమ క్రీడాభూమి తమకు దక్కడం సంతోషకరమని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Induction Stove: ఇండక్షన్ స్టవ్పై నీరు చిందితే.. షాక్ కొడుతుందా? ఈ నిజాలు తెలుసుకోండి!