Kondagattu Incident: తెలంగాణలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. హనుమాన్ విజయోత్సవ వేడుకల వేళ స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఎండ తీవ్రత దృష్ట్యా అధికారులు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు అకస్మాత్తుగా కుప్పకూలడంతో, వాటి కింద ఉన్న సుమారు 10 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో ఆలయ పరిసరాల్లో హాహాకారాలు మిన్నంటాయి.
హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా భారీగా తరలివచ్చే మాలధారుల కోసం ఈ తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. అయితే, వేడుకల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల నాణ్యత లేని పనితనం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలహీనంగా ఉన్న స్తంభాలు, సరిగ్గా బిగించని పందిళ్లు భక్తుల పాలిట శాపంగా మారాయి. తమ కోర్కెలు తీర్చమని వేడుకోవడానికి వచ్చిన భక్తులు, ఇలా రక్తపు మడుగులో ఆస్పత్రి పాలవ్వడం అందరినీ కలిచివేస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే తోటి భక్తులు, స్థానికులు స్పందించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇంతటి ముఖ్యమైన పండగ సమయంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. “అంజన్న సన్నిధిలో అధికారుల వైఫల్యం” అంటూ ఆలయ ప్రాంగణంలో నిరసన వ్యక్తమవుతోంది.
గతంలో కూడా కొండగట్టు ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదాలు భక్తులను భయబ్రాంతులకు గురిచేయగా, ఇప్పుడు ఆలయ ఆవరణలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే ఈ క్షేత్రంలో కనీస వసతులు, భద్రత కరువవ్వడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రపు ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకోవడం వల్లే ఈ అనర్థం జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: గ్యాస్ సెగ.. రోడ్డుకెక్కిన ఆటో డ్రైవర్లు.. స్తంభించిన సాగర్ హైవే!
ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రాతిపదికన పటిష్టమైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే గాయపడిన భక్తులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సర్వత్రా విజ్ఞప్తి వెల్లువెత్తుతోంది.
కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి
ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి భక్తులకు గాయాలు
హనుమాన్ విజయోత్సవ దినాన్ని పురస్కరించుకొని తరలివచ్చిన భక్తులు
నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భక్తుల ఆగ్రహం
Mishap at Kondagattu Anjaneya Swamy Temple
Cooling… pic.twitter.com/BTigXhhWU0— BIG TV Breaking News (@bigtvtelugu) April 1, 2026