Land Mafia: హైడ్రా ప్రజావాణి కేంద్రం సోమవారం బాధితుల ఆక్రందనలతో నిండిపోయింది. ముఖ్యంగా అమీన్పూర్ ప్రాంతానికి చెందిన బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాము ముఖీం అనుచరుల చేతిలో మోసపోయామని, తమ కష్టార్జితాన్ని నమ్ముకుని 70 గజాల చొప్పున ప్లాట్లు కొనుగోలు చేస్తే, ఇప్పుడు అవి ప్రభుత్వ భూములని తెలిసి లబోదిబోమంటున్నారు. “పెద్ద లాయర్లు మన వెంటే ఉన్నారు, ఏమీ కాదు” అని నమ్మబలికిన వారు, ఇప్పుడు ఏమీ తెలియదంటూ తప్పించుకుంటున్నారని, తమను నిలువునా ముంచారని వందలాది మంది మహిళలు, పురుషులు హైడ్రా కమిషనర్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రభుత్వ భూముల కబ్జాపై సర్వత్రా ఆందోళన
అమీన్పూర్ వ్యవహారమే కాదు, నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకోరుల చేతిలో చిక్కుకున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని బ్లూసీ హోటల్ వెనుక ఉన్న రెండు ఎకరాల విలువైన భూమి నుంచి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి సర్వే నంబర్ 54, మియాపూర్ సర్వే నంబర్ 100, 101లోని భూముల వరకు అక్రమార్కుల కన్ను పడింది. కొందరు వ్యక్తులు కోర్టు కేసుల పేరుతో భూమిని ఆక్రమించుకుంటూ, తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని హైడ్రా అధికారులను వేడుకున్నారు.
పార్కుల కోసం స్థలం.. కబ్జాదారుల వంతు
కేవలం ఇళ్ల స్థలాలే కాకుండా, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలు కూడా కబ్జాకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బేగంపేట బ్రాహ్మణ వాడి సర్వే నంబర్ 210లోని 3 వేల గజాల స్థలం, సైదాబాద్ ఫిష్ మార్కెట్ వద్ద ఉన్న 4083 గజాల ఖాళీ స్థలంలో పార్కులను అభివృద్ధి చేయాలని స్థానికులు దశాబ్ద కాలంగా కోరుతున్నారు. అయితే, ఈ ఖాళీ ప్రదేశాలను కూడా కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని, మధ్యలో కొందరు వ్యక్తులు వచ్చి ప్రభుత్వ భూమిపై హక్కులు క్లెయిమ్ చేస్తున్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి హైడ్రా.. బాధితుల్లో ఆశ
ప్రజావాణికి వచ్చిన వందలాది ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితుల వేదనను విన్న ఆయన, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పర్యటించి, పత్రాలను తనిఖీ చేసి, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిషనర్ హామీతో, ఎన్నాళ్లుగానో తమ భూముల కోసం, న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితుల్లో ఇప్పుడిప్పుడే కొంత ఆశ చిగురిస్తోంది.
న్యాయం కోసం వేచి చూస్తున్న పేదలు
నోటరీలు, అగ్రిమెంట్ల పేరుతో సామాన్యులను బురిడీ కొట్టించిన కబ్జాదారుల ఆగడాలకు హైడ్రా అడ్డుకట్ట వేస్తుందని బాధితులు ఆశిస్తున్నారు. కూలీ డబ్బులు, చిట్టీలు కట్టి, తమ సర్వస్వాన్ని ప్లాట్ల కోసం వెచ్చించిన వారికి, ప్రభుత్వం నుంచి తగిన న్యాయం జరగాలని కోరుతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, పేదలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడు హైడ్రాపైనే ఉంది. ఈ వరుస ఫిర్యాదులు నగరంలో భూ ఆక్రమణల మాఫియా ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలియజేస్తుంది.
Also Read: ఏపీకి పెట్టుబడుల వరద.. సింగపూర్లో ఏడు రోజుల పాటు మంత్రుల వ్యూహాత్మక పర్యటన.