Weather Update: రాష్ట్రమంతటా చలి గజగజ వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా చలి తీవ్రత అనూహ్యంగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కోల్డ్ వేవ్ (Cold Wave), సివియర్ కోల్డ్ వేవ్ (Severe Cold Wave) పరిస్థితులు రాష్ట్రంలో పలుచోట్ల నమోదవుతున్నాయి. ఉదయం పూట ఎండ కనిపించినా, రాత్రి వేళల్లో మరియ, తెల్లవారుజామున చలి తీవ్రత తట్టుకోవడం కష్టంగా మారింది. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయంటే, ఈ చలి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మిగతా జిల్లాల్లోనూ 12 డిగ్రీలలోపే నమోదు
సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోయిన జిల్లాలతో పాటు, మిగిలిన 8 జిల్లాల్లో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలలోపు నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం లెక్కల ప్రకారం, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చలి ప్రభావం అత్యంత ఎక్కువగా ఉంది. ఈ చలి గాలుల కారణంగా జనం ఉదయాన్నే పనులకు వెళ్లడానికి కూడా జంకుతున్నారు.
రాబోయే మూడు రోజులు మరింత చలి.. ఎల్లో అలర్ట్ జారీ!
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలను మరింత అప్రమత్తం చేసింది. రాబోయే మూడు రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల వరకు తగ్గుతాయని అంచనా వేసింది. చలి గాలుల ప్రభావం నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు. ప్రజలు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్లోనూ 9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
రాజధాని హైదరాబాద్లో కూడా చలి తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. భాగ్యనగరంలోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. శివారు ప్రాంతాల్లో అయితే మినిమం టెంపరేచర్స్ మరింత పడిపోతున్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 నుంచి 6.5 డిగ్రీల మధ్య నమోదైనట్టుగా తెలుస్తోంది. ‘విండ్ చిల్ ఫ్యాక్టర్’ (Wind Chill Factor) తో పాటు, పగటి పూట ఉష్ణోగ్రతల్లో తేడాల కారణంగా చలి తీవ్రత పెరిగి, చల్లటి గాలులు వీస్తున్నాయి.
చలి తీవ్రతకు కారణాలు ఇవే..
ఈ చలి తీవ్రతకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకటి, పొడిగాలి ప్రభావం. రెండవది, బలంగా వీస్తున్న ఈశాన్య గాలులు (Northeast Winds). ఈ గాలుల ప్రభావం రాత్రిపూట చల్లదనాన్ని విపరీతంగా పెంచుతున్నాయి. ఈ కారణంగానే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా, హైదరాబాద్తో సహా మధ్య తెలంగాణ ప్రాంతంలో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా.
Also Read: మద్యం మత్తులో తండ్రిని రోకలి బండతో.. మోది హత్య చేసిన కొడుకు
దట్టమైన పొగమంచుతో ప్రయాణాలకు ఆటంకం
చలి తీవ్రతతో పాటు ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు (Fog) కూడా కమ్ముకుంటోంది. ఈ పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ బాగా తగ్గిపోతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైవేలపై, గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణాలు చేసేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెటర్లు, ఉన్ని దుస్తులు ధరించడం, వేడి పానీయాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ చలి నుంచి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.